Uttar Pradesh: ఒకే డాక్టర్ పేరుపై 83 ఆసుపత్రుల రిజిస్ట్రేషన్.. యూపీలో వెలుగులోకి స్కామ్

Uttar Pradesh doctor has 83 hospitals registered in his name

  • వైద్యుల పేరిట, ఇతరులు ఆసుపత్రుల నిర్వహణ
  • ఆన్ లైన్ రెన్యువల్ విధానంతో బయటపడిన వ్యవహారం
  • 15 మంది వైద్యుల పేరిట 449 ఆసుపత్రులు, క్లినిక్ లు, ల్యాబ్ లు

ఉత్తరప్రదేశ్ లో వైద్యుల పేరిట సాగుతున్న పెద్ద స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఒక్కో డాక్టర్ పేరుపై పదుల సంఖ్యలో ఆసుపత్రులు నడుస్తున్నట్టు అక్కడి అధికారుల దృష్టికి వచ్చింది. ఒకే డాక్టర్ పై మీరట్, కాన్పూర్ తదితర ప్రాంతాల్లో 83 ఆసుపత్రులు ఉన్నట్టు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా హాస్పిటళ్లు, క్లినిక్ ల లైసెన్స్ ల రెన్యువల్ సందర్భంగా అక్రమాలు వెలుగు చూశాయి. 

ఆగ్రా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 449 ఆసుపత్రులు, క్లినిక్ లు 15 మంది డాక్టర్ల పేరుపై నిర్వహిస్తున్నట్టు తెలుసుకున్నారు. దీంతో సంబంధిత వైద్యులకు నోటీసులు జారీ చేశారు. వారి నుంచి స్పందన వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నారు. వైద్యులు కాని వారు, వైద్యుల పేరిట లైసెన్స్ తీసుకుని ఆసుపత్రులు, క్లినిక్ లు, పాథాలజీ ల్యాబ్ లను నిర్వహిస్తున్నట్టు విస్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రెన్యువల్ ను ఆన్ లైన్ ద్వారానే చేసుకోవాలంటూ సర్కారు తీసుకొచ్చిన ఆదేశాలతో ఈ అక్రమాలు బయటపడ్డాయి. రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు శిక్షణ పొందిన పారామెడికల్ సిబ్బంది వివరాలను కూడా సమర్పించలేదు. పడకల సమాచారం కూడా మోసపూరితమేనని అధికారులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News