Nandan Nilekani: విద్య ప్రసాదించిన ఐఐటీకి రూ.315 కోట్ల విరాళం

  • టెక్నాలజీ రంగ నిపుణుడు నందన్ నీలేకని నిర్ణయం
  • ఐఐటీ బాంబేకి భారీ విరాళం ఇస్తున్నట్టు ప్రకటన
  • గతంలోనూ రూ.85 కోట్ల విరాళం
Nandan Nilekani donates Rs 315 crore to alma mater IIT Bombay

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఐటీ రంగ నిపుణుడు, ఆధార్ రూపకర్త నందన్ నీలేకని దాతృత్వంలో కొత్త రికార్డు నమోదు చేశారు. తన పూర్వ విద్యా సంస్థ అయిన ఐఐటీ బాంబేకి రూ.315 కోట్ల భూరి విరాళం ప్రకటించారు. నీలేకని గతంలోనూ ఐఐటీ బాంబేకి రూ.85 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఇచ్చిన మొత్తంతో కలిపి చూస్తే ఆయన విరాళం రూ.400 కోట్లకు చేరింది. దేశంలో ఓ పూర్వ విద్యార్థి ఒక విద్యా సంస్థకు ఇచ్చిన భారీ విరాళం ఇదే కావడం గమనార్హం.

ప్రపంచస్థాయి సదుపాయాలు, పరిశోధన కోసం, ఐఐటీ బాంబేలో స్టార్టప్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేసేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. నీలేకని ఐఐటీ బాంబేలో 1973లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో చేరారు. ‘‘ఐఐటీ బాంబే నా జీవితానికి మూలస్తంభం వంటిది. నా ప్రయాణానికి పునాది వేసింది. ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థతో నా అనుబంధానానికి 50 ఏళ్లు. భవిష్యత్తు కోసం ఈ మొత్తాన్ని ఇస్తున్నందుకు గర్వపడుతున్నాను’’ అని నందన్ నీలేకని ప్రకటించారు.

More Telugu News