Chandrababu: బాగా భయపడిపోయిన ఎంపీ హైదరాబాద్ వెళ్లిపోతానంటున్నాడు: చంద్రబాబు

  • బాపట్ల జిల్లాలో బాలుడు అమర్నాథ్ దారుణ హత్య
  • సోదరిని వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు సజీవదహనం
  • బాలుడి కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఆర్థికసాయం
Chandrababu talks about recent crimes

బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం ఉప్పలవారిపాలెంలో సోదరిని వేధిస్తున్న వ్యక్తులను ప్రశ్నించి, వారి చేతిలో హతుడైన పదో తరగతి బాలుడు అమర్నాథ్ కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబు రూ.10 లక్షల ఆర్థికసాయం అందించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 

సోదరిని వేధిస్తున్నారని ప్రశ్నించిన బాలుడ్ని చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అమర్నాథ్ బంధువులు అంబులెన్స్ కోరితే పోలీసులు సమకూర్చలేదని ఆరోపించారు. బాలుడిపై ఎదురు కేసు పెట్టడానికి నేరస్తులు ప్రయత్నించారని చంద్రబాబు పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకోకపోతే బాధితులపైనే కేసు పెట్టేవారని వెల్లడించారు. 

తనపై దాడి చేసింది వెంకటేశ్వరరెడ్డేనని బాలుడు మరణవాంగ్మూలం ఇచ్చాడని వివరించారు. హత్య తర్వాత రూ.1 లక్ష చేతిలో పెట్టి మౌనంగా ఉండాలని ఎంపీ చెప్పారని చంద్రబాబు ఆరోపించారు. 

రాష్ట్రంలో గంజాయి, నేర సంస్కృతి పోతేనే అమ్మాయిలకు రక్షణ అని స్పష్టం చేశారు. గతంలో వైసీపీ అరాచకాలను ప్రశ్నిస్తే టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని, ఇటీల విశాఖలో ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి డబ్బులు గుంజారని వెల్లడించారు. బాగా భయపడిపోయిన ఎంపీ హైదరాబాద్ వెళ్లిపోతానని చెబుతున్నారని చంద్రబాబు తెలిపారు.

కాగా, బాలుడు అమర్నాథ్ సోదరిని తాము దత్తత తీసుకుంటున్నామని, ఎన్టీఆర్ ట్రస్టు తరఫున చదివిస్తామని చంద్రబాబు ప్రకటించారు.

More Telugu News