uttarakhand: భర్త పిటిషన్.. లివ్-ఇన్-పార్ట్‌నర్‌తో ఉండేందుకే మహిళకు హైకోర్టు అనుమతి

  • భర్తను, పిల్లల్ని వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో సహజీవనం
  • కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన భర్త
  • భర్తతో తాను ఉండలేనని, లివ్ - ఇన్ - పార్ట్‌నర్ తో ఉంటానని చెప్పిన మహిళ
Uttarakhand high court allows married woman to stay with live in partner

తన భార్య మిస్ అయిందని డెహ్రాడున్ కు చెందిన జిమ్ ట్రైనర్ అయిన ఓ భర్త ఉత్తరాఖండ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. ఆమె తన భర్తను, పదేళ్ల కొడుకును, ఆరేళ్ల కూతురును డెహ్రాడున్ లోనే వదిలేసి, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఫరీదాబాద్ కు చెందిన వ్యక్తితో సహజీవనం చేస్తోంది.

కోర్టుకు హాజరైన ఆమె తన భర్త తనతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని, తాను అతనితో కలిసి ఉండేది లేదని కోర్టుకు స్పష్టం చేసింది. దీంతో జస్టిస్ పంకజ్ పురోహిత్, జస్టిస్ మనోజ్ తివారీలతో కూడిన ధర్మాసనం ఆమెకు నచ్చినట్లుగా ఉండవచ్చునని తీర్పు ఇచ్చింది. 

భర్త తరఫున పిటిషన్ దాఖలు చేసిన అరుణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఇలాంటి తీర్పు వివాహ వ్యవస్థకు ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఆమెకు నచ్చినట్లుగా ఉండవచ్చునని కోర్టు తెలిపింది.

పిటిషన్ వేసిన భర్తకు మహిళతో 2012 ఫిబ్రవరిలో పెళ్లయింది. ఆమెకు ఫరీదాబాద్ కు చెందిన ఓ వ్యక్తితో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. 2022 ఆగస్ట్ 7న 37 ఏళ్ల వయస్సులో ఆమె అతని వద్దకు వెళ్లిపోయి, సహజీవనం చేస్తోంది. తాను తన ఇష్టపూర్వకంగా ఫరీదాబాద్ వ్యక్తితో సహజీవనం చేస్తున్నానని సదరు మహిళ చెప్పడంతో కోర్టు పైవిధంగా తీర్పు ఇచ్చింది.

More Telugu News