Manisha Kayande: ఉద్ధవ్ థాకరేకు మరో షాక్.. ఏక్ నాథ్ షిండే వర్గంలో చేరిన మహిళా ఎమ్మెల్సీ

  • ఏక్ నాథ్ షిండే పార్టీలో చేరిన మనీషా కయాండే
  • ఒరిజినల్ శివసేన షిండేదేనన్న మనీషా
  • పార్టీ నుంచి బహిష్కరించిన శివసేన వర్గం
MLC Manisha joins Eknath Shinde party

మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరేకు మరో షాక్ తగిలింది. ఆయన వర్గానికి చెందిన మహిళా ఎమ్మెల్సీ మనీషా కయాండే థాకరే వర్గాన్ని వీడి ఏక్ నాథ్ షిండేకు చెందిన శివసేనలో చేరిపోయారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ థకరే వర్గంపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉద్ధవ్ పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తమకు అందడం లేదని, ఉద్ధవ్ వర్గీయులు మహిళల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్ధవ్ వర్గాన్ని నేతలు వరుసగా ఎందుకు వదిలిపెడుతున్నారనే దానిపై ఆయన ఏడాది కాలమైనా దృష్టి సారించలేదని చెప్పారు. బాలాసాహెబ్ థాకరే స్థాపించిన ఒరిజినల్ శివసేన ఏక్ నాథ్ షిండేదేనని అన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ అజెండాలను సంజయ్ రౌత్, సుష్మ అంధారేలు అమలు చేస్తున్నారని విమర్శించారు. 

మరోవైపు కయాండేను ఉద్ధవ్ వర్గం పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆమెపై వేటు వేసింది. పార్టీ నుంచి బహిష్కరణకు గురైనప్పటికీ ఆమె ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. మరోవైపు ఉద్ధవ్ వర్గం స్పందిస్తూ... మరోసారి ఎమ్మెల్సీ సీట్ దక్కదనే కారణంతోనే ఆమె పార్టీని వీడారని విమర్శించింది.

More Telugu News