Jagan: జగన్ పై విమర్శలు గుప్పించిన సీపీఎస్ పోరాట సంఘాలు

  • ఓపీఎస్ అమలుచేస్తామని పాదయాత్ర సందర్భంగా జగన్ హామీ ఇచ్చారన్న పోరాట సంఘాలు
  • ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానాన్ని అంగీకరించబోమని స్పష్టీకరణ
  • జేఏసీ నేతలు స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపాటు
Employees unions fires on Jagan

ఏపీ ముఖ్యమంత్రి తమను మోసం చేశారని సీపీఎస్ పోరాట సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానాన్ని తాము అంగీకరించబోమని తెలిపాయి. పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చిన విధంగా ఓపీఎస్ ను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశాయి. తమ డిమాండ్ ను నెరవేర్చేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించాయి. మరోవైపు, జీపీఎస్ ను స్వాగతించిన జేఏసీ నేతలపై కూడా విమర్శలు గుప్పించాయి. జేఏసీ నేతలు స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

మరోవైపు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని జగన్ చెప్పారని... ఇంతవరకు ఆ హామీని నిలబెట్టుకోకుండా తమకు వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 6,667 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను మాత్రమే రెగ్యులరైజ్ చేయడం అన్యాయమని అన్నారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.

More Telugu News