Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ చోరీ

  • 10 లక్షల విలువైన వజ్రాలు, 10 తులాల బంగారు నగలు కొట్టేసిన దొంగ
  • రైలు ఎక్కుతుండగా మహిళ బ్యాగ్ లాక్కుని పరారీ
  • సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్న రైల్వే పోలీసులు
Vande Bharat passenger looted at Secunderabad Railway station

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో శనివారం ఉదయం భారీ దొంగతనం జరిగింది. రూ.10 లక్షల విలువైన వజ్రాలు, పది తులాల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. ఆ మహిళ కేకలు వేయడంతో స్టేషన్ లోని ప్రయాణికులు, రైల్వే పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే, అప్పటికే దొంగ పరారయ్యాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్లపోచంపల్లికి చెందిన స్రవంతి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నారు. శనివారం తిరుపతి వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు స్రవంతి వచ్చారు. ఈ క్రమంలో రైలు ఎక్కుతుండగా స్రవంతి చేతిలోని బ్యాగ్ ను గుర్తుతెలియని వ్యక్తి లాక్కెళ్లాడు.

శనివారం ఉదయం రైల్వే స్టేషన్ కు చేరుకున్న స్రవంతి వందేభారత్ ట్రైన్ కోసం వేచి ఉంది. చాలా సేపటి నుంచి ఆ స్రవంతిని గమనిస్తున్న యువకుడు.. రైలు ఎక్కే సమయంలో తాను కూడా ఎక్కుతున్నట్లు నటించాడు. రైలు ఎక్కే క్రమంలో స్రవంతి చేతిలో ఉన్న బ్యాగును లాక్కుని పరుగు అందుకున్నాడు. బ్యాగు పోవడంతో స్రవంతి నెత్తీనోరు బాదుకుంది. బ్యాగులో డైమండ్ నెక్లెస్ తో పాటు పది తులాల బంగారం, పది లక్షల విలువైన రెండు వజ్రాలు ఉన్నాయని చెబుతూ రోదించింది. స్రవంతి ఫిర్యాదుతో రైల్వే పోలీసులు స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దొంగను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

More Telugu News