Nara Lokesh: గౌతమ్ రెడ్డి ఆత్మకు జగన్ శాంతి లేకుండా చేశాడు: నారా లోకేశ్

  • ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నారా లోకేశ్ యువగళం
  • ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరంలో బహిరంగసభ
  • అమిత్ షా చెప్పింది నిజమైందన్న లోకేశ్
  • విశాఖ క్రైం క్యాపిటల్ అయిందని వ్యాఖ్యలు
  • ఆత్మకూరులో అవినీతి ఫుల్లు అని వెల్లడి
  • వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 60 కుటుంబాలు
Nara Lokesh speech at Anantasagaram meeting

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో నేడు కూడా కొనసాగింది. 128వ రోజు పాదయాత్ర అనంతసాగరం శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. అనంతసాగరం జంక్షన్ లో నిర్వహించిన బహిరంగసభకు జనం కిటకిటలాడారు. సభలో యువనేత మాట్లాడుతున్నంతసేపు కార్యకర్తల స్పందనతో సభ హోరెత్తింది. 

హత్యకు గురైన టీడీపీ కార్యకర్త చిట్టిబోయిన పెద్ద వెంగ‌య్య కుటుంబానికి లోకేశ్ అనంతసాగరంలో జరిగిన బహిరంగసభ వేదికపై ఆర్థికసాయం అందించారు. మృతుడి భార్య ధనలక్ష్మమ్మకి లోకేశ్ రూ.5 ల‌క్షలు సాయాన్ని అంద‌జేశారు

కబ్జాభూముల వాటాలో తేడా రావడం వల్లే ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్!

విశాఖలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబసభ్యుల కిడ్నాప్ స్కెచ్ వేసింది జగన్ సొంత మనుషులేనని లోకేశ్ ఆరోపించారు. ఎంపీ సత్యనారాయణ కొడుకు, భార్య, ఆడిటర్ జీవీని ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేసిందని, భూకబ్జాల వాటాల్లో తేడా వచ్చిందని, అందుకే ఈ కిడ్నాప్ జరిగిందని వివరించారు. 

ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరంలో నిర్వహించిన బహిరంగసభలో లోకేశ్ మాట్లాడుతూ... "జగన్ విశాఖను క్రైం క్యాపిటల్ చేశాడని అమిత్ షా గారు అంటే జగన్ మనోభావాలు దెబ్బతిన్నాయి అంట, మంత్రులంతా రోడ్డు మీదకి వచ్చి మొరిగారు. ఇప్పుడు ఏం జరిగింది? అమిత్ షా గారు మాట్లాడింది నిజం అని తేలింది, దీనికి జగన్ ఏమని సమాధానం చెబుతారు?" అని నిలదీశారు. 

జగన్ ఒక ఫెయిల్డ్ సీఎం!

జగన్ ఒక ఫెయిల్డ్ సీఎం. ఈ మాట ఎందుకు అంటునాన్నో ఒకే ఒక్క ఉదాహరణ చెబుతా. బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల్ గారు. ఆయన పేషీలో సిబ్బందికి 7 నెలలుగా జీతాలు ఇవ్వలేదు. సిబ్బందికి మండింది. ఏకంగా మంత్రి పేషీకి తాళాలు వేసి వెళ్లిపోయారు. 

వాళ్ళకి జీతాలు ఎక్కడి నుండి రావాలో తెలుసా? బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్. అంటే ఇక్కడ సీఎం ఫెయిల్, బీసీ శాఖ మంత్రి ఫెయిల్, ప్రభుత్వం ఫెయిల్, బీసీ కార్పొరేషన్ ఫెయిల్, కాపు కార్పొరేషన్ ఫెయిల్.

విద్యార్థులు పెరిగింది ఎక్కడ?

డిజిటల్ బోర్డు మీద చేత్తో చెరిపే మేధావి జగన్... ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు పెరిగారు అని చెబుతున్నాడు. ఇంగ్లిష్ అనడం కూడా రాక వింగ్లిష్ అంటున్నాడు. 2022-23 లో 47,40,421విద్యార్థుల‌కి విద్యాకానుక కిట్లు పంపిణీ చేశారు. 2023-24 లో 43,10,165 కిట్లు విద్యార్థుల‌కి ఇచ్చారు. 4 ల‌క్ష‌ల 30 వేల మంది విద్యార్థులు త‌గ్గారు. మ‌రి కన్నింగ్ జగన్ చెప్పిన పెరిగిన విద్యార్థులు ఎక్క‌డ వున్నారో? 

కన్నింగ్ జగన్ ప్రజలకు కరెంట్ షాక్ ఇస్తున్నాడు. ఒక్క మే నెలలో జగన్ బాదుడు ఎంతో తెలుసా? రూ.11,300 కోట్లు. ఇప్పుడు వందల్లో బిల్లు వచ్చే వారికి వేలల్లో వస్తుంది. 

మహాశక్తితో మహిళల కష్టాలు తీరుస్తాం!

భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద... ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం.

అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతి

కన్నింగ్ జగన్ జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్-2 లేదు, డీఎస్సీ లేదు. జీవో నెం.77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

ఆత్మకూరులో అవినీతి ఫుల్లు... అభివృద్ధి నిల్లు!

ఆత్మకూరులో అభివృద్ధి నిల్లు... వైసీపీ నేతల అవినీతి ఫుల్లు. పెన్నా నదిని ఏటీఎస్ (ఎనీ టైం స్యాండ్) లా మార్చుకున్నారు ఈ వైసీపీ నేతలు. విపరీతంగా ఇసుకను దోచేస్తున్నారు. ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది మంటూ కొంత మంది గ్రావెల్ అక్రమ రవాణా చేస్తున్నారు. ఏకంగా నాడు- నేడు పనుల కోసం వచ్చిన మెటీరియల్ తో వైసీపీ నాయకులు ఇళ్లు నిర్మించుకుంటున్నారు. 

జగన్ చనిపోయిన గౌతమ్ రెడ్డి గారికి, ఆత్మకూరు నియోజకవర్గానికి తీరని అన్యాయం చేశాడు.  సెంచురీ ప్లై వుడ్ కంపెనీని ఆత్మకూరుకి తీసుకొస్తే జగన్ దానిని దొంగలా ఎత్తుకుపోయాడు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి లేకుండా చేశాడు జగన్.

వైసీపీ నుండి టీడీపీలోకి 60 కుటుంబాలు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని వైసీపీకి చెందిన 60 కీలక కుటుంబాలు లోకేశ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే ఆనం రామనారాయణారెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం యువగళం క్యాంపు సైట్ లో శుక్రవారం ఈ చేరికలు జరిగాయి. యువనేత లోకేశ్ 60 వైసీపీ కుటుంబాల వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికి, అభినందించారు. వైసీపీ ఆరాచక పాలన అంతం చేయడానికి కృషి చేసి, నియోజకవర్గంలో పసుపు జెండాను ఎగరేయాలని కోరారు. 

*యువగళం వివరాలు:*

ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 1638.3 కి.మీ.

ఈరోజు నడిచిన దూరం 14.4 కి.మీ.

129వ రోజు పాదయాత్ర వివరాలు (17-6-2023):

వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి నెల్లూరు జిల్లా):

మధ్యాహ్నం 

2.00 – కుల్లూరు క్యాంప్ సైట్ లో యానాది సామాజికవర్గీయులతో ముఖాముఖి.

సాయంత్రం

4.00 – కుల్లూరు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.10 – కుల్లూరులో స్థానికులతో సమావేశం.

5.10 – మాదన్నగారిపల్లిలో స్థానికులతో సమావేశం.

5.35 – వెంకట్రామరాజు పేటలో స్థానికులతో మాటామంతీ.

5.40 – చింతలపాలెం ఎస్సీ కాలనీలో దళితులతో సమావేశం.

6.50 – ఉయ్యాలపల్లిలో స్థానికులతో సమావేశం.

7.05 – కొత్తూరుపల్లి క్రాస్ వద్ద ఎస్సీ సామాజికవర్గీయులతో భేటీ.

8.25 – తేగచర్లలో స్థానికులతో సమావేశం.

9.10 – తేగచర్ల శివారు విడిది కేంద్రంలో బస.

******

More Telugu News