kottu satyanarayana: అర్థపర్థం లేకుండా మాట్లాడుతున్నారు.. పవన్ కల్యాణ్ పై కొట్టు సత్యనారాయణ మండిపాటు

  • పవన్‌ తన రాజకీయాల కోసం కాపులను వాడుకోవాలని చూస్తున్నారన్న కొట్టు
  • ఆయన పనిచేసేది చంద్రబాబు కోసమేనని విమర్శ 
  • పవన్ మాటలు కాపుల మనోభావాలు దెబ్బ తీస్తున్నాయని వ్యాఖ్య
andhra pradesh deputy cm kottu satyanarayana comments on pawan kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు. పవన్‌ తన రాజకీయాల కోసం కాపులను వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. పవన్‌ పనిచేసేది చంద్రబాబు కోసమేనని ఎద్దేవా చేశారు. కాపులు ఏకం కాకుండా చంద్రబాబు కుట్ర చేశారని మండిపడ్డారు.

ముద్రగడ కుటుంబాన్ని చంద్రబాబు ఎలా వేధించారో పవన్‌కు తెలియదా? అని మంత్రి ప్రశ్నించారు. పవన్ అర్థపర్థం లేకుండా మాట్లాడుతూ ప్రజల్లో చులకన అవుతున్నారని విమర్శించారు. కాపులు జగన్‌మోహన్‌రెడ్డిని నమ్మారు కాబట్టే 60 శాతం కాదు 90 శాతం ఓట్లు వేసి గెలిపించారన్నారు. అందుకే సీఎం కూడా కాపులకు సముచిత స్థానం కల్పించారని కొనియాడారు. 

చంద్రబాబు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ల తప్పుడు జీవో కంటే.. సీఎం జగన్‌ ఇచ్చిన దాని వల్లే మేలు జరుగుతుందని పవన్‌కు తెలియడం లేదా అంటూ కొట్టు సత్యనారాయణ ఫైర్‌ అయ్యారు. ‘‘పవన్‌ చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు కాపుల మనోభావాలు దెబ్బ తీస్తున్నాయి. చంద్రబాబు చేసిన అవినీతి పవన్‌కు కనపడట్లేదు. ఎందుకంటే ఆయనకు కావాల్సిన ప్యాకేజీలు అందుతున్నాయి కాబట్టి. అందుకే బాబు గొప్పోడిలాగా కనపడుతున్నారు’’ అని మండిపడ్డారు.

More Telugu News