6 day old: తల్లిదండ్రుల మృతదేహాల పక్కనే మూడు రోజులుగా పసికందు.. డెహ్రాడూన్ లో దయనీయ దృశ్యం!

  • ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు
  • తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లిన పోలీసులు
  • మృతదేహాల పక్కనే సొమ్మసిల్లిన స్థితిలో పసికందు
  • హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన వైద్య సిబ్బంది
6 day old lies near parents bodies for 3 days

అటు తల్లి.. ఇటు తండ్రి విగతజీవులుగా పడి ఉండగా మధ్యలో రోజుల పసికందు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఒకటి రెండు కాదు.. కనీసం మూడు రోజులుగా ఆ పసికందు అలాగే ఉన్నాడట. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వారు ఫిర్యాదు చేయగా పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. లోపల కనిపించిన దృశ్యం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. డెహ్రాడూన్ పోలీసులకు మంగళవారం ఎదురైన విషాద సంఘటన ఇది.

ఉత్తరప్రదేశ్ కు చెందిన కాషిఫ్, ఆనమ్ దంపతులు డెహ్రాడూన్ లో స్థిరపడ్డారు. ఆనమ్ ఈ నెల 8న ఓ బాబుకు జన్మనిచ్చింది. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ రెండు మూడు రోజులుగా వారు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ఇరుగుపొరుగు వారు కూడా పట్టించుకోలేదు. అయితే, కాషిఫ్ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు తలుపులు బద్దలుకొట్టి ఇంట్లోకి అడుగుపెట్టగా.. నేల మీద ఓ వైపు కాషిఫ్, మరోవైపు ఆనమ్ విగతజీవులుగా పడి ఉన్నారు. వారి మృతదేహాల మధ్య సొమ్మసిల్లిని స్థితిలో రోజుల పసికందు కనిపించాడు. ఆ దయనీయమైన దృశ్యం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.

అక్కడి పరిస్థితి చూస్తే కాషిఫ్, ఆనమ్ చనిపోయి మూడు రోజులకు పైనే అయి ఉంటుందని పోలీసులు చెప్పారు. మూడు రోజులుగా పసికందు అలాగే ఉన్నాడని, ఆకలికి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయాడని వివరించారు. బాబును వెంటనే ఆసుపత్రికి తరలించగా.. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో పెట్టి వైద్యులు చికిత్స చేస్తున్నారు. కాగా, ఆర్ధిక సమస్యలతో ఆ దంపతులు ఆత్మహత్య చేసుకుని వుండచ్చని పోలీసులు భావిస్తున్నారు.

More Telugu News