Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి ఎలాంటివాడో కేంద్ర హోంమంత్రే చెప్పారు: చంద్రబాబు

  • కుప్పంలో చంద్రబాబు సభ
  • వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్న అధినేత
  • ఏపీ ప్రభుత్వం అవినీతిమయం అని కేంద్రమే చెబుతోందని వెల్లడి
  • చర్యలు ఎప్పుడు తీసుకుంటారంటూ కేంద్రాన్ని ప్రశ్నించిన చంద్రబాబు
Chandrababu speech in Kuppam

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వచ్చారు. కుప్పం సభలో ఆయన ప్రసంగిస్తూ... వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలు ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. 

కుప్పంలో పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తున్నామని అన్నారు. ఎప్పుడో జమిందార్లు కట్టిన కోదండరాస్వామి దేవాలయాన్ని బాగు చేసే బాధ్యతను టీడీపీ స్వీకరిస్తుందని వెల్లడించారు. కోలార్ (కేజీఎఫ్) నుంచి కుప్పంకు మల్టీలేన్ రోడ్డు వేస్తామని, కనెక్టివిటీ రోడ్లు కూడా వేస్తామని తెలిపారు. 

"మొన్ననే మేనిఫెస్టో ప్రకటించాం. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసున్న ఆడవాళ్లకు నెలకు రూ.1500 ఇస్తాం. అర్హత ఉన్న స్త్రీలు ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఇస్తాం. నాన్న బుడ్డి పెట్టి అమ్మ ఒడిని దగా చేశాడు. ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికే ఇస్తానంటాడు. 

కానీ మేం అలా కాదు... ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పేరిట డబ్బులు ఇస్తాం. పిల్లల చదువును సులభతరం చేస్తాం. ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలుంటే రూ.15 వేలు చొప్పున ముగ్గురికీ ఇస్తాం. ఆడబిడ్డలు బయటకు వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. 

ధరలు విపరీతంగా పెరిగిపోయాయి... బాదుడే బాదుడు... ఇంకా బాదుతూనే ఉన్నాడు. అందుకే, ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం. ఈ సైకో ముఖ్యమంత్రిని మళ్లీ కోలుకోకుండా భూస్థాపితం చేయాలి. 

యువతకు ఉద్యోగాలు రావడంలేదు. జాబు రావాలంటే టీడీపీ రావాల్సిందే. జాబ్ క్యాలెండర్ అన్నాడు... ఈ ముఖ్యమంత్రి ఒక్క ఉద్యోగమైనా ఇచ్చాడా... మటన్ కొట్లో, చికెన్ కొట్లో, ఫిష్ మార్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటున్నాడు. నేను యువతకు ఐటీలో ఉద్యోగాలు ఇప్పించాను. టీడీపీ అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. 

చదువుకున్న పిల్లలు తల్లిదండ్రులపై ఆధారపడకుండా, నిరుద్యోగభృతి కింద రూ.3 వేలు ఇస్తాం. నాడు టీడీపీ హయాంలో నిరుద్యోగ భృతి ఇచ్చాం... ఆ తర్వాత ఈ ముఖ్యమంత్రి వచ్చి ఆ పథకం తీసేశాడు... ఎందుకు తీసేశాడో చెప్పడు. 

ఈ ముఖ్యమంత్రి లాంటి అవినీతిపరుడు ఇంకెక్కడా లేడని కేంద్ర హోంమంత్రి చెప్పారు... బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా అదే చెప్పాడు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయం అని కేంద్రం పెద్దలే చెప్పారు... చర్యలు ఎప్పుడు తీసుకుంటారని అడుగుతున్నా. టీడీపీ అధికారంలోకి వచ్చాక, దోపిడీ సొమ్మంతా కక్కిస్తాం. రూ.2 వేల నోట్లు రద్దు చేశాక ఈ దోపిడీదారులకు ఏంచేయాలో పాలుపోవడంలేదు... అందుకే ఆ నోట్లను వైన్ షాపుల్లో మార్చుకుంటున్నారు" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

More Telugu News