Revanth Reddy: కొడంగల్ ఎంత ముఖ్యమో.. నిర్మల్‌లో గెలుపు కూడా అంతే: రేవంత్ రెడ్డి

  • నిర్మల్ కు చెందిన శ్రీహరిరావు కాంగ్రెస్ లో చేరిక
  • కొంతమంది పార్టీని వీడినా.. అంతకంటే బలమైన లీడర్లు పార్టీలోకి వస్తున్నారన్న రేవంత్
  • తెలంగాణ సమాజం తిరగబడే సమయం ఆసన్నమైందని వ్యాఖ్య
Revanth Reddy says Congress will win kodangal

కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవడం ఎంత ముఖ్యమో.. నిర్మల్ లో గెలవడం అంతే ప్రాధాన్యతగా తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నిర్మల్ కు చెందిన శ్రీహరి రావు పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ కుటుంబంలో చేరిన వారికి సముచిత గౌరవం దక్కుతుందన్నారు. కొంతమంది పార్టీని వీడి తమకు నాయకులే ఉండరన్నట్లుగా వ్యవహరించారని, కానీ అంతకంటే బలమైన వారు పార్టీలోకి వచ్చారని చెప్పారు. కొడంగల్ తో పాటు నిర్మల్ ను ప్రాధాన్యతగా తీసుకుంటామని, దీనిపై ఇంద్రకరణ్ రెడ్డికి సవాల్ విసురుతున్నట్లు చెప్పారు.

ఏ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించారో ఆ గ్రామంలో బీఆర్ఎస్ ఓట్లు అడగాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టిన ప్రాంతంలో కాంగ్రెస్ వాళ్ళం అడుగుతామన్నారు. కేసీఆర్ మోసాన్ని భరించే ఓపిక తెలంగాణ ప్రజలకు లేదని, తెలంగాణ సమాజం తిరగబడే సమయం అసన్నమైందన్నారు. కేసీఆర్ చేతిలో మోసపోయిన వారి జాబితాలో శ్రీహరిరావు మొదటి వరుసలో ఉంటారన్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ పదింట ఎనిమిది గెలుస్తుందన్నారు. తెలంగాణలో ఒక నిశ్శబ్ద విప్లవం, ఒక తుపాను రానున్నాయన్నారు.

తెలంగాణలో ధరణి పోర్టల్ ను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ అనే సంస్థకు అప్పగించారని రేవంత్ ఆరోపించారు. ప్రజల భూముల వివరాలను ప్రయివేటు సంస్థ చేతిలో పెట్టారన్నారు. ధరణి నిర్వహణపై ఐఎల్ఎఫ్ సంస్థతో రూ.150 కోట్లకు ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. ఐఎల్ఎఫ్ సంస్థకు చెందిన 99 శాతం వాటాను టెరాలసిస్ టెక్నాలజీస్ అనే సంస్థ కొనుగోలు చేసిందన్నారు. 70 లక్షల భూయజమానుల వివరాలను ఐఎల్ఎఫ్ సంస్థకు విక్రయించారని ఆరోపించారు.

More Telugu News