vikarabad: శిరీషను చంపింది ఆమె బావే.. మిస్టరీని ఛేదించిన పోలీసులు!

  • నీటి గుంటలో తోసి శిరీషను హత్య చేసిన అనిల్
  • మద్యం మత్తులో కళ్లల్లో పొడిచినట్లు వెల్లడి
  • అనిల్ కు సహకరించిన రాజు
Shireesha murder mystery revealed by police

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన యువతి శిరీష హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ దారుణానికి పాల్పడింది శిరీష బావేనని వెల్లడించారు. దర్యాఫ్తులో అనిల్ తన నేరాన్ని ఒప్పుకున్నాడని వివరించారు. శనివారం అర్ధరాత్రి శిరీషను బయటకు పిలిచి, నీటి గుంటలో పడేసి చంపేసినట్లు తెలిపాడని పేర్కొన్నారు. మద్యం మత్తులో శిరీషపై బ్లేడ్, స్క్రూ డైవర్ తో దాడి చేశాడని, కళ్లల్లో పొడిచాడని పోలీసులు తెలిపారు.

జిల్లాలోని పరిగి మండలం కాళ్లాపూర్‌కు చెందిన జట్టు శిరీష(19) శనివారం రాత్రి గ్రామ శివారులో చెరువు దగ్గర విగతజీవిగా కనిపించింది. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత పోలీసులు శిరీష మృతదేహాన్ని అప్పగించడంతో బంధువులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, శిరీష మృతిపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేయడం, కుటుంబ సభ్యుల ప్రవర్తనపై సందేహం వ్యక్తం కావడంతో మరోమారు పోస్టుమార్టం నిర్వహించారు. శిరీష కళ్లను పొడిచినట్లు, స్ర్కూడ్రైవర్‌ లాంటి వస్తువుతో గాయపరిచినట్లు వైద్యులు తేల్చారు. శరీరంపై బ్లేడ్ గాయాలు ఉన్నాయని వివరించారు.

శిరీష హత్య వెనక ఆమె తండ్రి జంగయ్య, బావ అనిల్ పాత్ర ఉందని గ్రామస్తులు ఆరోపించారు. దీంతో పోలీసులు జంగయ్య, అనిల్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. మృతురాలి ఫోన్ లోని కాల్ డేటా, ఇతర వివరాలు సేకరించి విశ్లేషించగా అనిల్ పై సందేహాలు పెరిగాయని పోలీసులు చెప్పారు. అనిల్ ను విచారించగా.. శిరీషను చంపేసినట్లు తెలిపాడన్నారు. ఈ హత్యకు అనిల్ స్నేహితుడు రాజు కూడా సహకరించాడని పోలీసులు చెప్పారు.

More Telugu News