గాలి జనార్దన్ రెడ్డికి షాక్.. 82 ఆస్తులను జప్తు చేయాలని సీబీఐ స్పెషల్ కోర్టు ఆదేశం!

  • అక్రమ మైనింగ్ కేసుల్లో ఆస్తుల అటాచ్ మెంట్
  • గాలి, ఆయన భార్యకు చెందిన 82 ఆస్తుల జప్తుకు కోర్టు ఆదేశం
  • దేవుడి దయతో కేసుల నుంచి బయటపడతానన్న గాలి
ఐరన్ ఓర్ మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి సీబీఐ స్పెషల్ కోర్టు షాక్ ఇచ్చింది. అక్రమ మైనింగ్ కేసుల్లో ఆయనకు, ఆయన భార్య గాలి లక్ష్మీ అరుణకు చెందిన 82 ఆస్తులను జప్తు చేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గాలిపై ఉన్న అన్ని కేసులు తేలేదాకా ఈ ఆస్తులన్నీ జప్తులోనే ఉంటాయని కోర్టు తెలిపింది. 

వాస్తవానికి గాలి దంపతులకు చెందిన 124 ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతించాలంటూ సీబీఐ అధికారులు కోర్టును కోరారు. అయితే, 82 ఆస్తులను జప్తు చేయాలంటూ కోర్టు ఆదేశించింది. ఈ ఆస్తుల్లో 77 జనార్దన్ రెడ్డి పేరిట ఉండగా, 5 ఆస్తులు ఆయన భార్య పేరు మీద ఉన్నాయి. సీబీఐ స్పెషల్ కోర్టు ఆదేశాలపై గాలి జనార్దన్ రెడ్డి స్పందిస్తూ... దేవుడి ఆశీస్సులతో కేసుల నుంచి బయటపడతానని చెప్పారు. 

కాగా, అక్రమ మైనింగ్ కేసుల్లో బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత జనార్దన్ రెడ్డి బెంగళూరుకే పరిమితమయ్యారు. బళ్లారికి వెళ్లకూడదంటూ ఆయనకు కోర్టు షరతులు విధించింది. ఇంకోవైపు కల్యాణ రాజ్య ప్రగతిపక్ష పేరుతో పార్టీని స్థాపించిన గాలి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన పార్టీ తరపున పోటీ చేసిన ఇతరులంతా ఓటమిపాలయ్యారు.

Gali Janardhan Reddy
Assets
Attachment
CBI
Speacial Court

More Telugu News