RBI: తిరిగొచ్చిన రూ.2 వేల కరెన్సీ నోట్లను ఆర్బీఐ ఏంచేస్తుందంటే..!

  • కాల్చేయడం లేదా ముక్కలు చేయడం ద్వారా నాశనం చేస్తుందట
  • కొత్తగా ఉన్న నోట్లు మిగతా కరెన్సీ నోట్ల తయారీలో వాడకం
  • రూ.2 వేల నోటు తయారీకి ఒక్కోదానికి 4 రూపాయల ఖర్చు
  • వెల్లడించిన ఆర్థిక నిపుణులు
RBI Receives Nearly 2 Lakh Crore 2000 Rupees Notes What To Do With Those Notes

మార్కెట్ లో నుంచి రూ.2 వేల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ప్రజలు తమ దగ్గరున్న రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవడం కానీ, డిపాజిట్ చేయడం కానీ చేయాలని ఆర్బీఐ సూచించింది. దీంతో చాలామంది ఇప్పటికే ఈ పెద్ద నోట్లను మార్చేసుకున్నారు. ఇప్పటి వరకు సగం పెద్ద నోట్లు వెనక్కి వచ్చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సుమారు 1.80 లక్షల కోట్ల రూ.2వేల నోట్లు వచ్చాయని ఆర్బీఐ గవర్నర్ అధికారికంగా తెలిపారు. 

ఇక రూ.2 వేల కరెన్సీ నోటు తయారీకి ఆర్బీఐకి నాలుగు రూపాయలు ఖర్చవుతుంది. ఇంత ఖర్చు చేసి తయారుచేసిన నోట్లను ఇప్పుడు ఏంచేస్తుందనేది చాలామందిలో కలిగే సందేహం. దీనికి అధికారులు వెల్లడించిన వివరాలు..

ఉపసంహరణ ప్రకటన నేపథ్యంలో తిరిగి వచ్చిన కరెన్సీ నోట్లను ఆర్బీఐ మొదటగా ప్రాంతీయ శాఖల కార్యాలయాలకు పంపిస్తుంది. వాటిలో నకిలీ నోట్లు ఏమైనా ఉన్నాయా.. ఉంటే ఎన్ని? అనేది తేలుస్తారు. యంత్రాల సహాయంతో నోట్లను స్కాన్ చేస్తారు. ఆపై పాడైపోయిన నోట్లను వేరు చేసి వాటిని తగలబెడుతారు. మెషిన్ లో వేసి కొన్నింటిని చిన్నచిన్న ముక్కలుగా చింపేస్తారు. బాగున్న కరెన్సీ నోట్లను ఇతర కరెన్సీ నోట్ల తయారీలో, పాడైపోయిన వాటిని కార్డ్ బోర్డు తయారీలో ఉపయోగిస్తారు. డీమానిటైజేషన్ పక్రియలో తిరిగొచ్చిన రూ.500, రూ.వెయ్యి నోట్లను ఆర్బీఐ వివిధ కంపెనీలకు కిలోల చొప్పున అమ్మేసింది. సుమారు 800 టన్నుల పాత నోట్లను ఇలా అమ్మేసిందని అధికారవర్గాలు తెలిపాయి.

More Telugu News