గుజరాత్ వైపు దూసుకొస్తున్న బిపోర్ జోయ్ తుపాను... ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

Modi held review meeting as extremely severe cyclonic storm Biparjoy braces towards Gujarat coast
  • అరేబియా సముద్రంలో అత్యంత తీవ్ర తుపానుగా బలపడిన బిపోర్ జోయ్
  • పోరుబందర్ కు నైరుతి దిశలో 310 కిమీ దూరంలో కేంద్రీకృతం
  • ఈ నెల 15న గుజరాత్ లోని కచ్, పాకిస్థాన్ లోని కరాచీ మధ్య తీరం దాటే అవకాశం
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్ జోయ్ తుపాను అత్యంత తీవ్ర తుపానుగా బలపడింది. ఇది ప్రస్తుతం గుజరాత్ లోని పోరుబందర్ కు నైరుతి దిశగా 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 

బిపోర్ జోయ్ తుపాను ఉత్తర దిశగా పయనించి గుజరాత్ లోని కచ్ (మాండ్వీ), పాకిస్థాన్ లోని కరాచీ మధ్య ఈ నెల 15న తీరం దాటనుంది. దీని ప్రభావంతో కుంభవృష్టి, ఉప్పెన, వరదలు సంభవిస్తాయని, గంటకు 150 కిమీ గరిష్ఠ వేగంతో పెనుగాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. 

ఈ అత్యంత తీవ్ర తుపాను గుజరాత్ వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో, కేంద్రం అప్రమత్తమైంది. తుపాను పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. 

కాగా, బిపోర్ జోయ్ తుపాను నేపథ్యంలో, గుజరాత్ తీరంలో మత్స్య సంబంధ కార్యకలాపాలు నిలిచిపోయాయి. తుపాను ప్రభావం చూపిస్తుందని భావిస్తున్న ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.
Go Back to Shorts
Narendra Modi
Biparjoy
ESCS
Cyclone
Gujarat

More Telugu News