Mitchell Starc: ఐపీఎల్ డబ్బుదేముంది... జాతీయ జట్టుకు ఆడడమే నా ప్రాధాన్యత: స్టార్క్

  • 2015 నుంచి ఐపీఎల్ కు దూరంగా మిచెల్ స్టార్క్
  • ఐపీఎల్ ను ఎంజాయ్ చేశానని వెల్లడి
  • ఐపీఎల్ డబ్బును కోల్పోతున్నందుకు తానేమీ చింతించడంలేదని స్పష్టీకరణ
  • డబ్బు వస్తుంది... పోతుంది అంటూ వ్యాఖ్యలు
Starc comments on IPL money

ఆస్ట్రేలియా జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్లో విజయం సాధించిన అనంతరం ఆ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్క్ చివరిసారిగా ఐపీఎల్ లో ఆడింది 2015లో. గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన స్టార్క్ అనేక సీజన్లుగా ఐపీఎల్ లో ఆడడడంలేదు. 

ఐపీఎల్ లో ఆడడాన్ని తాను ఆస్వాదించానని, అలాగే పదేళ్ల కిందట యార్క్ షైర్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడడాన్ని కూడా ఎంజాయ్ చేశానని స్టార్క్ తాజాగా వెల్లడించాడు. అయితే, ఫ్రాంచైజీ క్రికెట్ ఆడితే వచ్చే డబ్బు కంటే, ఆస్ట్రేలియా జట్టుకు ఆడడానికే తొలి ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశాడు. ఐపీఎల్ తరహా క్రికెట్ ఆడితే వచ్చే డబ్బును కోల్పోతున్నందుకు తానేమీ చింతించడంలేదని అన్నాడు. డబ్బు వస్తుంది, పోతుంది... కానీ ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆడే అవకాశమే అన్నింటికంటే గొప్పదని అభిప్రాయపడ్డాడు.

అయితే, ఐపీఎల్ లో మరోసారి ఆడడం తనకు ఇష్టమేనని, కానీ, ఫార్మాట్లతో సంబంధం లేకుండా ఆస్ట్రేలియా జట్టుకు వీలైనంత ఎక్కువ సేవలు అందించాలన్నదే తన లక్ష్యమని ఈ ఎడమచేతివాటం ఫాస్ట్ బౌలర్ వివరించాడు.

More Telugu News