Karumuri Nageswara Rao: అన్నింట్లో ఏపీ నెంబర్ వన్ అని కేంద్రం చెబుతుంటే, అవినీతి అంటూ అమిత్ షా వ్యాఖ్యానిస్తారా?: మంత్రి కారుమూరి

  • విశాఖ సభలో వైసీపీని టార్గెట్ చేసిన అమిత్ షా
  • అమిత్ షా ఎవరో చెప్పిన మాటలు పలికారన్న మంత్రి కారుమూరి
  • అమిత్ షా సభా వేదికపై ఉన్నవారంతా టీడీపీ నుంచి వచ్చినవారేనని వెల్లడి
Minister Karumuri replies to Amit Shah remarks

వైజాగ్ సభలో కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. అన్ని రంగాల్లో ఏపీ నెంబర్ వన్ అని కేంద్రం ప్రకటనలు ఇస్తుంటే, ఏపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని అమిత్ షా వ్యాఖ్యానించడం సరికాదని కారుమూరి పేర్కొన్నారు. 

నిన్న అమిత్ షా విశాఖ సభలో వేదికపై ఉన్నవారంతా టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన వారే ఉన్నారని, వారి మనస్సు ఒక చోట, మనుషులు మరో చోట ఉన్నట్టుందని విమర్శించారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఆయన సొంతంగా అన్నట్టు లేవని, ఎవరో ఆయన చెవిలో ఊదిన విషయాలనే మాట్లాడినట్టుందని మంత్రి కారుమూరి ఆరోపించారు. 

రైతులు ఏళ్ల తరబడి కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు... దీని పట్ల అమిత్ షా సిగ్గుపడాలని అన్నారు. అమిత్ షా గతంలో తిరుపతి పర్యటనకు వస్తే టీడీపీ నిరసన ప్రదర్శనలు చేపట్టిందని, ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు నోటికొచ్చినట్టు మాట్లాడలేదా? అని కారుమూరి ప్రశ్నించారు. 

ఎంతమంది కలిసొచ్చినా సీఎం జగన్ ను ఏమీ చేయలేరని, రాష్ట్రంలో సీఎం జగన్ ప్రతి ఇంట్లో మనిషిలా మారారని వెల్లడించారు.

More Telugu News