Giriraj Singh: గాడ్సే.. భరతమాత బిడ్డ: కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

  • గాడ్సే.. భారతదేశంలోనే పుట్టాడన్న కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
  • బాబర్, ఔరంగజేబుల మాదిరి ఆక్రమణదారుడు కాదని వ్యాఖ్య
  • బాబర్ వారసులుగా పిలిపించుకునే వాళ్లు.. భరతమాత బిడ్డలు కాలేరని విమర్శ
Godse was nations saput not invader like Aurangzeb says BJPs Giriraj Singh hits back at Owaisi

విమర్శలకు కౌంటర్ ఇవ్వబోయి వివాదంలో చిక్కుకున్నారో కేంద్ర మంత్రి. మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే ‘భరతమాత విలువైన బిడ్డ’ అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల చేసిన ‘గాడ్సే వారసులు’ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఈ మాటలు అన్నారు.

చత్తీస్ గఢ్ లోని దంతెవాడలో ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిరిరాజ్ మాట్లాడుతూ.. ‘‘గాడ్సే.. గాంధీ హంతకుడు కావచ్చు. ఆయన భరతమాత బిడ్డ కూడా. ఆయన భారతదేశంలోనే పుట్టాడు. బాబర్, ఔరంగజేబుల మాదిరిగా పరాయి దేశం నుంచి వచ్చిన ఆక్రమణదారుడు కాదు. బాబర్ వారసులుగా పిలిపించుకునేందుకు ఇష్టపడేవారు.. ఎప్పటికీ భరతమాత బిడ్డలు కాలేరు’’ అని అన్నారు. 

టిప్పూ సుల్తాన్, ఔరంగజేబులకు మద్దతుగా సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల నేపథ్యంలో కొల్హాపూర్ లో అల్లర్లు జరిగాయి. ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. అల్లర్లు సృష్టిస్తున్న వారు ఔరంగజేబు వారసులంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. ‘‘ఔరంగజేబు వారసుల గురించి అంతా తెలిసిన మీకు.. గాడ్సే, ఆప్టేల వారసుల గురించి కూడా తెలిసి ఉండాలి’’ అని అన్నారు.

More Telugu News