YSRCP: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైసీపీ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక

  • ప్రశాతంగా ముగిసిన ఎన్నికలు
  • ఎన్నికైన వారందరూ వైసీపీ నేతలే
  • కోరం లేక చిత్తూరు జిల్లాలోని మూడు మండలాల్లో ఎన్నిక వాయిదా
YSRCP Sweeps Local Body Polls

ఏపీలో స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగింది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు ఏర్పడిన ఖాళీలకు నిన్న జరిగిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు నిర్వహించిన అనంతరం సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా గంటా పద్మశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఆ బాధ్యతల్లో ఉన్న కవురు శ్రీనివాస్ ఎమ్మెల్సీగా వెళ్లడంతో ఈ స్థానం ఖాళీ అయింది. దీంతో ఈ స్థానానికి పద్మశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

ఏలూరు జిల్లా నూజివీడు పురపాలక సంఘం మున్సిపల్ వైస్ చైర్మన్‌గా 22వ వార్డు వైసీపీ కౌన్సిలర్ కొమ్ము వెంకటేశ్వరరావు, పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా వైసీపీ ఎంపీటీసీ ముప్పిడి సరోజని, నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వైసీపీ నాయకురాలు బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్‌గా కోనేటి రామకృష్ణ, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా-1గా వైసీపీ నేత ముచ్చు లయయాదవ్, అదే జిల్లా ఎల్.కోట మండల పరిషత్ రెండో వైస్ ఎంపీపీగా భీమాళి వైసీపీ ఎంపీటీసీ మధునూరు శ్రీనివాసవర్మరాజు, గుంటూరు జిల్లా తెనాలి మున్సిల్ రెండో వైస్ చైర్మన్‌గా 40వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అత్తోట నాగవేణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కాచర్ల లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, స్థానిక సంస్థలకు సంబంధించి బత్తలపల్లి ఎంపీపీ, చెన్నేకొత్తపల్లి వైస్ ఎంపీపీ-1, అనంతపురం జిల్లా విడపనకల్లు ఉపాధ్యక్షురాలు-2, అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీపీ స్థానాల్లో వైసీపీ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లాలోని మూడు మండలాల్లో ఖాళీగా ఉన్న ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యుల ఎంపిక కోరం లేక వాయిదా పడింది.

More Telugu News