Kriti Sanon: 'ఆదిపురుష్' హీరోయిన్, దర్శకుడిపై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడి ఆగ్రహం

  • నిన్న ఉదయం శ్రీవారిని దర్శించుకున్న కృతి, ఓం రౌత్
  • కృతి వెళ్తుండగా హత్తుకుని, ముద్దు పెట్టిన రౌత్
  • ఆందోళనకర విషయమన్న చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు
Chilukuru Balaji priest fires on Kriti Sanon and Om Raut

ప్రభాస్, కృతి సనన్ జంటగా 'ఆదిపురుష్' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతిలో అట్టహాసంగా జరిగింది. అయితే నిన్న ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనానంతరం హీరోయిన్ కృతి సనన్, దర్శకుడు ఓం రౌత్ హగ్ చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై హైదరాబాద్ సమీప చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తిరుమల శ్రీవారి దర్శనానికి 'ఆదిపురుష్' చిత్ర బృందం వెళ్లడం సంతోషకరమని రంగరాజన్ అన్నారు. అయితే స్వామివారి దర్శనానంతరం సీతమ్మ పాత్రను పోషించిన అమ్మాయి, ఆ సినిమా దర్శకుడు ఆలయం నుంచి బయటకు వచ్చారని... స్వామివారి శేషవస్త్రం ధరించి వారు కౌగిలి, చుంబనం చేయడం ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. 

తిరుమల కొండకు భార్యాభర్తలు వచ్చినా ఎంతో నిష్ఠగా ఉంటారని, వికారమైన ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడతారని అన్నారు. అలాంటి ప్రదేశంలో కౌగిలింతలు, ముద్దులు దారుణమని చెప్పారు. ఎంతో మంది భక్తులు ఉన్నచోట ఆ పనులు ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవతల పాత్రలను పోషించిన వారు అంతే భక్తిశ్రద్ధలతో ఉండాలని చెప్పారు. సీత పాత్రకు కృతి సనన్ సెట్ కాలేదని వ్యాఖ్యానించారు.

More Telugu News