బెంగళూరు ఎయిర్ పోర్టులో సిబ్బంది చేతివాటం
- ప్రయాణికుడి బ్యాగ్ నుంచి రెండు ఐఫోన్ల చోరీ
- సీసీటీవీ ఫుటేజి ఆధారంగా దొంగను గుర్తించిన పోలీసులు
- ఉద్యోగం నుంచి తీసేసిన ఎయిర్ లైన్స్ సంస్థ
బెంగళూరుకు చెందిన హేమంత్ కుమార్ ఏప్రిల్ 28న చండీగఢ్ వెళ్లేందుకు విస్తారా ఎయిర్ లైన్స్ విమానంలో టికెట్ బుక్ చేసుకున్నాడు. ఎయిర్ పోర్టులో హేమంత్ లగేజీ చెక్ చేసిన సెక్యూరిటీ సిబ్బంది.. ఆయన బ్యాగులో ఉన్న రెండు పవర్ బ్యాంకులను తీసేసారు. విమానంలో పవర్ బ్యాంకులు తీసుకెళ్లడం నిషేధమని చెప్పారు. ఆపై లగేజీని విమానంలోకి చేర్చేందుకు పంపించారు. చండీగఢ్ లో విమానం దిగాక హేమంత్ తన లగేజీ చెక్ చేసుకోగా అందులోని రెండు ఐఫోన్లు మాయమైనట్లు గుర్తించాడు.
దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు బెంగళూరు ఎయిర్ పోర్టుకు సమాచారం అందించారు. లగేజీ లోడింగ్ చేసే దగ్గర అమర్చిన సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా.. శుభం మిశ్రా అనే ఉద్యోగి ఈ చోరీ చేసినట్లు కనిపించింది. దీంతో అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించిన విస్తారా ఎయిర్ లైన్స్ కంపెనీ.. బాధితుడు హేమంత్ కుమార్ కు ఆ ఫోన్ల ఖరీదును చెల్లించింది. చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.