KTR: భద్రతకు, భరోసాకు మారుపేరు, ప్రశాంతతకు చిరునామా తెలంగాణ: కేటీఆర్​

  • దశాబ్ది ఉత్సావాల్లో భాగంగా ఈ రోజు  సురక్షా దినోత్సవం 
  • పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్
  • దేశానికే తలమానికంగా తెలంగాణ పోలీస్ యంత్రాంగం ఉందని కితాబు
KTR all Praises telangana Police on Surakha day

భద్రతకు, భరోసాకు మారుపేరు, ప్రశాంతతకు చిరునామా తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో శాంతి భద్రతల నిర్వహణలో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలను ఉపయోగిస్తూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా పటిష్టమైన శాంతిభద్రతల నిర్వహణతో పెట్టుబడులకు ఆకర్షణీయమైన రాష్ట్రంగా పేరుగాంచిందని అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సావాల్లో భాగంగా ఈ రోజు  సురక్షా దినోత్సవం  నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. పోలీసులు, ఇతర సంబంధిత శాఖల్లోని సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. 

దేశానికే తలమానికంగా తెలంగాణ పోలీస్ యంత్రాంగం ఉందన్నారు. ప్రభుత్వం పోలీసు వ్యవస్థని పూర్తిగా అధునీకరించి, అవసరాల మేర పునర్‌వ్యవస్థీకరించి.. ఆధునిక హంగులతో కూడిన కొత్త వాహనాలతో పోలీసింగ్‌ని మరింత పటిష్టపరించిందన్నారు. కమిషనరేట్లు, కొత్త పోలీస్ స్టేషన్ల పెంపు, సరికొత్త జిల్లా ఎస్పీ కార్యాలయాల భవనాలతో పోలీసు వ్యవస్థ ముఖచిత్రమే మారిపోయిందన్నారు. మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ 'షీ టీమ్స్', 'షీ క్యాబ్స్' వంటి వినూత్న ఆలోచనలతో ఆడబిడ్డల రక్షణకి భరోసానిస్తుంది కేసీఆర్ ప్రభుత్వం. దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన షీ టీమ్స్ అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. ప్రపంచంలో అత్యధిక సీసీటీవీలతో పటిష్టమైన శాంతిభద్రతల నిర్వహణ చేస్తున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రభాగాన ఉన్నది’ అని పేర్కొన్నారు.
 
మతకలహాలు లేని ప్రశాంతమైన నగరంగా హైదరాబాద్ లో ప్రజలు విరాజిల్లుతున్నారని కేటీఆర్ అన్నారు. ‘ఒకప్పుడు మత కల్లోలాలతో నష్టపోయిన హైదరాబాద్ మహానగరంలో గత తొమ్మిదేళ్లుగా ఒక్క మతకలహం కూడా లేదు. వరుసగా కొన్నేళ్లపాటు అత్యంత నివాసయోగ్య నగరంగా హైదరాబాద్ నగరం అంతర్జాతీయ గుర్తింపు పొందటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. మత సామరస్య పరిరక్షణ విషయంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు సురక్షా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణలో ఎనలేని సేవలు అందజేస్తున్న పోలీసులు, ఇతర సంబంధిత శాఖల్లోని ప్రతి ఒక్కరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

More Telugu News