Coromandel Express: కోరమాండల్ రైలును వెంటాడిన బ్లాక్ ఫ్రైడే .. 14 ఏళ్ల కిందట ఇదే శుక్రవారం ప్రమాదం

  • నిన్న ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం
  • 280 పైచిలుకు మంది దుర్మరణం
  • 2009లో ఇదే రైలుకు ప్రమాదం జరిగి 16 మంది మృతి    
 Another Black Friday Same Coromandel Express Tragedy Strikes Again After 14 Years

ఒడిశాలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘోర ప్రమాదం.. భారత  రైల్వేలో అతి పెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోయింది. శుక్రవారం జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటికే 280 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఆగివున్న గూడ్స్‌ రైలును అత్యంత వేగంగా ఢీకొట్టి మరో ట్రాక్‌పై పడిపోయింది. అదే సమయంలో బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్‌ ట్రైన్‌ వచ్చి ఢీకొట్టడంతో పెను ప్రమాదం సంభవించింది. దాంతో, మృతుల సంఖ్య భారీగా పెరిరగింది. 

కాగా, 14 ఏళ్ల కిందట కూడా కోరమాండల్ రైలుకు ప్రమాదం జరిగింది. 2009లో ఫిబ్రవరి 13వ తేదీన జైపూర్‌ రోడ్‌ రైల్వే స్టేషన్‌ దాటుతుండగా ప్రమాదానికి గురైంది. ట్రాక్‌ మార్చుకుంటున్న సమయంలో అదుపుతప్పి బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ ఘటనలో 16 మంది మరణించారు. ఆ ప్రమాదం కూడా శుక్రవారం రోజునే, అది కూడా రాత్రి 7:30 నుంచి 7:40 గంటల మధ్యలోనే జరగడం శోచనీయం. దాంతో, కోరమాండల్ రైలును బ్లాక్ ఫ్రైడే వెంటాడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే గతంలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే అదుపుతప్పడంతో మృతుల సంఖ్య తక్కువగా ఉంది. కానీ ఈ సారి ఒకేసారి మూడు రైళ్లు ప్రభావితం అవడంతో తీవ్రత ఊహించలేని విధంగా పెరిగిపోయింది.

More Telugu News