ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై విచారణకు ఏపీ సర్కారు ఆదేశం

  • ఉద్యోగులకు ఆఫీసు బేరర్ లేఖలు, నకిలీ ధ్రువపత్రాల జారీ వ్యవహారంపై స్పందించిన ఏపీ సర్కారు
  • పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ను విచారణాధికారిగా నియమించిన సీఎస్
  • విచారణ చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశాలు
  • అప్పటిదాకా ఏపీజీఈఏ లేఖలను నిలిపివేయాలని ఉత్తర్వులు
ఉద్యోగులకు ఆఫీసు బేరర్ లేఖలు, నకిలీ ధ్రువపత్రాలు జారీ చేశారన్న ఆరోపణలపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ)పై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్‌ను విచారణాధికారిగా నియమిస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. బదిలీల నుంచి మినహాయింపు కోసం నకిలీ ఆఫీసు బేరర్ లేఖలు, ధ్రువపత్రాలు ఏపీజీఈఏ జారీ చేస్తోందన్న ఆరోపణలపై విచారణకు ఆదేశించారు.

తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎస్టీఓలు, ఎస్ఆర్ఓ, ఏటీఓ, సీటీఓలు, డీసీటీవోలు, వైద్యులకు, వివిధ విభాగాల ఉద్యోగులకు ఏపీజీఈఏ నకిలీ లేఖలు జారీ చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. సాధారణ బదిలీల నుంచి మినహాయింపు పొందేలా ఈ నకిలీ లేఖల్ని వినియోగిస్తున్నట్టు తమకు సమాచారం అందిందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ వ్యవహారంపై విచారణ చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సిందిగా విచారణాధికారికి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు విచారణ పూర్తయ్యే వరకు ఏపీజీఈఏ లేఖలను నిలిపివేయాలని స్పష్టం చేసింది.

APGEA
order for inquiry
ap govt employees Association
CS

More Telugu News