Talasani: ఫిష్ ఫుడ్ ఫెస్టివెల్ ఏర్పాట్లపై తలసాని సమీక్ష

  • తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో వేడుకలు
  • దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రచారం చేయాలని సూచన
  • 8న చెరువుల పండుగ వేదికలను ఏర్పాటు చేయాలని పిలుపు
Talasani on Fish food festival

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జూన్ 2వ తేదీ నుండి 22 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్ణయించారు. ఈ మేరకు అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో గురువారం దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, 8, 9, 10 తేదీల్లో నిర్వహించనున్న ఫిష్ ఫుడ్‌ ఫెస్టివల్‌ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్‌ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమలు చేస్తున్న కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమాలు, లబ్ధిదారులకు జరిగిన మేలుపై పాంప్లెట్స్ ద్వారా వివరించాలన్నారు. రాష్ట్రంలో గొర్రెలపై సబ్సిడీ, వాహనాలపై సబ్సిడీ, ఉచిత చేప పిల్లల లబ్ధిదారులు చాలామంది ఉన్నారని, వారిని పశుసంవర్ధక, మత్స్య శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 3న తెలంగాణ రైతు దినోత్సవం సందర్భంగా గ్రామాల్లోని రైతు వేదికల వద్ద నిర్వహించే కార్యక్రమాల్లో పాడి రైతులు, మత్స్యకారులు పాల్గొనే విధంగా చూడాలన్నారు. 8న చెరువుల పండుగ సందర్భంగా చెరువులు, రిజర్వాయర్ల వద్ద వేదికలను ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేయాలన్నారు.

More Telugu News