Vidadala Rajini: వైద్య ఆరోగ్య శాఖ హిస్టరీలోనే ఇదొక చరిత్ర: ఏపీ మంత్రి విడదల రజని

  • ఐదు మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తున్నామన్న మంత్రి రజని
  • సెప్టెంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని వెల్లడి
  • 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయన్న వైద్య మంత్రి
5 medical colleges opening this year says Vidadala Rajini

ఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీలను ప్రారంభించబోతున్నట్టు ఏపీ వైద్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. ఈ కాలేజీలు రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల, విజయనగరంలలో ఏర్పాటు అవుతున్నాయని... ఈ కళాశాలల్లో ఆగస్టులో సీట్లు భర్తీ చేస్తామని, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని చెప్పారు. కొత్త కాలేజీల ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. 

వందేళ్ల క్రితం విశాఖలో తొలి మెడికల్ కాలేజీ ఏర్పాటయిందని... ఈ వందేళ్లలో 11 మెడికల్ కాలేజీలు వస్తే, వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని రజని చెప్పారు. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి రూ. 500 కోట్లు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ హిస్టరీలోనే ఇదొక చరిత్ర అని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 462 మెడికల్ పీజీ సీట్లను అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖలో 49 వేల పోస్టులను భర్తీ చేశామని తెలిపారు.  

More Telugu News