Budda Venkanna: ముందస్తు అయినా, వెనకస్తు అయినా టీడీపీదే గెలుపు.. తమ్మినేని పందిలా బలిశారు: బుద్ధా వెంకన్న

  • చచ్చే వరకు టీడీపీలోనే ఉంటానని తమ్మినేని చెప్పారన్న బుద్ధా
  • వచ్చే ఎన్నికల్లో తమ్మినేని ఓటమి ఖాయమని వ్యాఖ్య
  • 600 ఎకరాల్లో విజయసాయి, అమర్నాథ్ బినామీ పేర్లతో వెంచర్లు వేశారని ఆరోపణ
Budda Venkanna fires on Tammineni Sitaram

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చచ్చే వరకు టీడీపీలోనే ఉంటానని చెప్పిన తమ్మినేని... వైసీపీలో చేరిన తర్వాత ప్రజల సొమ్ము తిని పందిలా బలిశారని అన్నారు. ఇప్పుడు బురద పందిలా మారి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో తమ్మినేని ఓటమి ఖాయమని... అంకుశం సినిమాలో రామిరెడ్డి మాదిరి ఆముదాలవలస రోడ్డుపై తమ్మినేని రోడ్డు మీద ఉండాల్సి వస్తుందని అన్నారు. చంద్రబాబునే ఫినిష్ చేస్తానని అంటావా? నీకు బుద్ధి ఉందా? అని మండిపడ్డారు. 

తల్లి పేరు చెప్పుకుని అవినాశ్ రెడ్డి బెయిల్ తెచ్చుకున్నారని బుద్ధా వెంకన్న అన్నారు. వివేకా హత్య కేసులో అవినాశ్ కంటే జగనే ఎక్కువ భయపడుతున్నారని చెప్పారు. జనాల దగ్గరకు డేరాలు కట్టుకుని వెళ్లే జగన్ డేరాబాబా అని ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా, వెనకస్తు ఎన్నికలు వచ్చినా గెలిచేది టీడీపీనే అని చెప్పారు. 

వైసీపీ నేతలు కబ్జా చేసిన భూముల్లో పేదలకు జగన్ ఇంటి స్థలాలు ఇవ్వాలని వెంకన్న డిమాండ్ చేశారు. 600 ఎకరాల్లో విజయసాయిరెడ్డి, గుడివాడ అమర్ నాథ్ లు బినామీ పేర్లతో వెంచర్లు వేశారని చెప్పారు. ఆ స్థలాలు కొని ఎవరూ మోసపోద్దని సూచించారు.

More Telugu News