ఇది ట్రైలర్ మాత్రమే.. అసలైన సినిమా ముందుంది: గంటా శ్రీనివాసరావు

  • టీడీపీ మినీ మేనిఫెస్టో వైసీపీ నేతల గుండెల్లో గుబులు రేపుతోందన్న గంటా
  • నాలుగేళ్లుగా జగన్ విధ్వంసక పాలన కొనసాగుతోందని విమర్శ
  • నరకాసుర పాలనకు చరమగీతం పాడాలని వ్యాఖ్య
నాలుగేళ్ల జగన్ పాలనలో ఏపీ నాశనం అయిందని టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ప్రజా వేదిక కూల్చివేతతో పాలనను ప్రారంభించిన జగన్... విధ్వంసకర విధానాలతో పాలనను కొనసాగిస్తున్నారని అన్నారు. టీడీపీ మినీ మేనిఫెస్టో వైసీపీ నేతల గుండెల్లో గుబులు రేపుతోందని చెప్పారు. తమ మేనిఫెస్టో ప్రజల్లో సంచలనం రేకెత్తిస్తోందని... దీన్ని తట్టుకోలేక కొందమంది వైసీపీ నేతలు టీడీపీ మేనిఫెస్టోను చించివేశారని విమర్శించారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలైన సినిమా ముందుందని చెప్పారు. 

నాలుగేళ్లుగా జగన్ విధ్వంసకర పాలన కొనసాగుతోందని గంటా విమర్శించారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి అమ్మఒడి ఇస్తామన్న జగన్... ఆ తర్వాత ఒక్కరికే ఇస్తున్నారని అన్నారు. జగన్ పాలనలో ఏపీ అరాచకంలో ఆఫ్ఘనిస్థాన్ ను, అప్పుల్లో శ్రీలంకను దాటిపోయిందని చెప్పారు. మద్య నిషేధం విధిస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. కరెంట్ ఛార్జీలను 7 సార్లు పెంచారని అన్నారు. దేశంలో అత్యధిక పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలో ఉన్నాయని చెప్పారు. జగన్ కు సొంత తల్లి, చెల్లెలు కూడా దూరమయ్యారనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో నరకాసుర పాలనకు చరమగీతం పాడాలని చెప్పారు.

Ganta Srinivasa Rao
Telugudesam
Jagan
YSRCP

More Telugu News