MA Shareef: స్పీకర్ తమ్మినేని ఇవాళ గల్లీ లీడర్ కంటే హీనంగా మాట్లాడారు: ఎంఏ షరీఫ్

  • బ్లాక్ క్యాట్ రక్షణ లేకపోతే చంద్రబాబు ఫినిష్ అన్న తమ్మినేని
  • చంద్రబాబుకు జెడ్ ప్లస్ భద్రత ఎందుకని ప్రశ్నించిన వైనం
  • తమ్మినేని మాటలు బాధాకరమన్న ఎంఏ షరీఫ్
  • రాజకీయంగా మీరే ఫినిష్ అవుతారంటూ వైసీపీ నేతలకు హెచ్చరిక 
MA Shareef condemns Tammineni Sitharam comments on Chandrababu

బ్లాక్ క్యాట్ కమెండోలను తీసేస్తే చంద్రబాబు ఫినిష్... దేశంలో ఇంకెవరికీ ముప్పు లేదా, ఇంకెవరికీ బెదిరింపులు రావడంలేదా... వాళ్లందరికీ లేని బ్లాక్ క్యాట్ భద్రత చంద్రబాబుకు ఎందుకు? అంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

దీనిపై ఏపీ శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ స్పీకర్ హోదాలో ఉన్న తమ్మినేని సీతారాం ఇవాళ గల్లీ లీడర్ కంటే హీనంగా దిగజారి మాట్లాడారని విమర్శించారు. 

రాజకీయాలకు అతీతంగా పదవీ బాధ్యతలు నిర్వర్తించాల్సిన స్పీకర్... ఈ రోజు తనకున్న హద్దులు అతిక్రమించి చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ప్రజాస్వామ్య విధానాలకు, చట్టసభల సంప్రదాయ విలువలకు తీవ్ర విఘాతం కలిగించారని మండిపడ్డారు. 

చట్టసభలకు ఉన్న గౌరవం, ఔన్నత్యాన్ని మంటగలిపే రీతిలో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడడం బాధాకరమని షరీఫ్ పేర్కొన్నారు. చంద్రబాబుకు రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక, అహంతో, రాజకీయ అక్కసుతో వెళ్లగక్కిన మాటలు తప్ప మరొకటి కాదని అన్నారు. 

"జెడ్ ప్లస్ రక్షణ తొలగిస్తే చంద్రబాబు ఫినిష్ అని ఒక శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ మాట్లాడే మాటలు కావు. తన స్థాయిని మరిచి మాట్లాడుతూ ప్రజల ఛీత్కారానికి గురి అవుతున్నారు అనే విషయాన్ని ఆయన గమనిస్తే మంచిది. రాబోయే రోజులలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సహా మీరందరూ, రాజకీయంగా ఫినిష్ అయ్యే రోజులు దగ్గరపడ్డాయి అనే విషయాన్ని గుర్తెరిగి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలు మీ డిపాజిట్లు కూడా గల్లంతు చేసే పరిస్థితి దాపురిస్తుంది జాగ్రత్త" అంటూ షరీఫ్ హెచ్చరికలు చేశారు.

More Telugu News