Delhi murder: ఢిల్లీ బాలిక హత్య ఘటనలో.. హంతకుడిని పట్టిచ్చిన ఫోన్ కాల్

  • బాలికను చంపేశాక యూపీకి పారిపోయిన సాహిల్
  • మేనత్త ఇంట్లో తలదాచుకున్న హంతకుడు
  • బాలిక స్నేహితురాలిని విచారించగా సాహిల్ విషయం వెలుగులోకి  
How A Phone Call By Sahils Bua To His Father Helped Police Nab Him

దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన బాలిక హత్యలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. హంతకుడు సాహిల్ ను ఓ ఫోన్ కాల్ ఆధారంగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య చేశాక ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి సాహిల్ ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ కు పారిపోయాడు. అక్కడ తన తండ్రి సోదరి ఇంట్లో తలదాచుకున్నాడు. సాహిల్ సడెన్ రాకతో ఆశ్చర్యపోయిన మేనత్త.. తన సోదరుడు (సాహిల్ తండ్రి) కి ఫోన్ చేసింది. ఈ ఫోన్ కాల్ ఆధారంగా సాహిల్ ఉనికిని గుర్తించిన పోలీసులు.. యూపీ పోలీసుల సాయంతో సాహిల్ ను అదుపులోకి తీసుకున్నారు.

షాబాద్ కాలనీలో ఆదివారం సాయంత్రం సాహిల్ తన ప్రియురాలును దారుణంగా చంపేసిన విషయం తెలిసిందే. కత్తితో 22 సార్లు పొడిచి, బండరాయితో తలను ఛిద్రం చేసి హత్య చేశాడు. ఆపై ఫోన్ ఆఫ్ చేసుకుని పరారయ్యాడు. బస్సులో బులంద్ షహర్ వెళ్లి మేనత్త ఇంట్లో తలదాచుకున్నాడు. బాలిక హత్య కేసు పరిశోధిస్తున్న పోలీసులకు హంతకుడు ఎవరనేది తెలియరాలేదు. బాలిక తల్లిదండ్రులను విచారించినా ఉపయోగంలేకపోయింది.

బాలిక కొన్ని రోజులుగా తన స్నేహితురాలు ఇంట్లో ఉంటోందని పోలీసులకు తెలిసింది. దీంతో సదరు స్నేహితురాలిని విచారించగా.. సాహిల్ తో సన్నిహితంగా ఉన్న విషయం బయటపడింది. ఈ సమాచారంతో సాహిల్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. అయితే, అప్పటికే కొడుకు కనిపించడంలేదని సాహిల్ తండ్రి ఆందోళన చెందుతున్నాడు. ఈ క్రమంలోనే సాహిల్ తండ్రికి ఆయన సోదరి ఫోన్ చేసింది. సాహిల్ తన దగ్గరికి వచ్చాడని చెప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. యూపీ పోలీసులకు సమాచారం అందించి సాహిల్ ను అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News