Nikhil Kamath: ఫ్రెండ్ షిప్ సంక్షోభం కూడా వచ్చేసిందంటున్న జెరోదా కామత్

  • సన్నిహిత మిత్రులు లేకపోవడమే స్నేహ మాంద్యం
  • అమెరికన్ సర్వేను ప్రస్తావించిన నిఖిల్ కామత్
  • భవిష్యత్తులో ఇదొక పెద్ద సంక్షోభం అవుతుందన్న అంచనా
Zerodha co founder Nikhil Kamath is worried about friendship recession

ఫ్రెండ్ షిప్ మాంద్యం ఏంటీ అనుకుంటున్నారా? నిజమే నేడు పరిశీలించి చూస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. జెరోదా కామత్ ఈ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చి, ఆరోగ్యకరమైన చర్చకు అవకాశం కల్పించారు. ప్రపంచం స్నేహ మాంద్యాన్ని ఎదుర్కొంటోందంటూ ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పేర్కొన్నారు. చాలా మంది తమకు సన్నిహిత మిత్రులు లేరని వాపోతున్నట్టు చెప్పారు. తనకు ఐదుగురు మిత్రులు ఉన్నారంటూ, వారి కోసం అన్నీ చేస్తానని చెప్పారు. 

ట్విట్టర్ పేజీలో ఇన్ఫోగ్రాఫిక్స్ ను షేర్ చేశారు నిఖిల్ కామత్. ఇవి 2021 అమెరికా సర్వేకు సంబంధించినవి. చాలా మందిలో స్నేహ మాంద్యం ఏర్పడుతోందన్న సందేశం ఈ చిత్రాల్లో ఉంది. స్నేహితులు ఎంత మంది అయినా ఉండొచ్చు. కానీ, తమ కష్ట, సుఖాల్లో తోడుగా, అండగా ఉండే కనీసం ఓ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయినా ఉండాలి కదా,. ఇది లేకపోవడమే స్నేహ మాంద్యం. మనం సంతోషంగా ఉండాలంటే ఒక కమ్యూనిటీ కలిగి ఉండాలనే అంశాన్ని కామత్ ప్రస్తావించారు. ‘‘నా జీవితంలో ఐదుగురు సోదరులు ఉన్నారు. వారి కోసం నేను అన్నీ చేస్తాను. జీవితాన్ని మార్చే అంశం ఇది నిజంగా’’ అని కామత్ ట్వీట్ చేశారు. 

స్నేహ మాంద్యం అనేది భవిష్యత్తులో అతిపెద్ద సమస్యగా మారుతుందని అమెరికా సర్వే అంటోంది. ఒంటరితనం అనేది రోజుకు 15 సిగరెట్లు తాగినంత నష్టానికి కారణమవుతుందని పేర్కొంది. స్నేహితులు లేకుండా పోవడానికి కారణాలను ప్రస్తావించింది. భౌగోళికంగా వేర్వేరు ప్రాంతాలకు తరలిపోవడం, పిల్లల పెంపకంపై తల్లిదండ్రుల ఫోకస్ పెరగడం, పనే సర్వస్వం అన్న సంస్కృతి పెరగడం, బంధాలు విచ్ఛిన్నం కావడంతో అది ఫ్రెండ్ షిప్ పై ప్రభావం చూపిస్తున్నట్టు సర్వే పేర్కొంది.

More Telugu News