Chandrababu: జగన్ విధ్వంస పాలనతో రాష్ట్ర ఆదాయం దెబ్బతింది: చంద్రబాబు

  • రాజమండ్రిలో టీడీపీ మహానాడు
  • తొలిరోజున ప్రతినిధుల సభలో చంద్రబాబు ప్రసంగం
  • రాష్ట్ర నాశనమే వైసీపీ సర్కారు లక్ష్యమన్న టీడీపీ అధినేత
Chandrababu take a dig at CM Jagan in TDP Mahanadu

రాజమండ్రి వద్ద నేడు ప్రారంభమైన టీడీపీ మహానాడు తొలిరోజున ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రసంగించారు. జగన్ విధ్వంసక పాలనతో రాష్ట్ర ఆదాయం దెబ్బతిందని అన్నారు. రాష్ట్ర నాశనమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని విమర్శించారు. 

2019 నాటికి ఆంధ్రప్రదేశ్ ఆదాయం రూ.66,786 కోట్లు... తెలంగాణ ఆదాయం రూ.69,620 కోట్లు అని వెల్లడించారు. కానీ, 2022-23 నాటికి ఏపీ ఆదాయం రూ.94,916 కోట్లు మాత్రమేనని చంద్రబాబు తెలిపారు. అదే సమయంలో తెలంగాణ ఆదాయం రూ.1.32 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. 

ఆనాడు ఇంచుమించు సమానంగా ఉన్న ఆదాయం జగన్ పాలనలో తగ్గిందని విమర్శించారు. ఏపీ కంటే తెలంగాణలో 40 శాతం అధికంగా ఆదాయం వచ్చిందని వెల్లడించారు. అమరావతి, పోలవరం పూర్తయితే ఏపీ కూడా కళకళలాడేదని అన్నారు. ఏపీలో జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు, అమ్మకపు పన్ను ఆదాయం తగ్గిందని చంద్రబాబు పేర్కొన్నారు. 

ఇక, రాష్ట్రంలో మాదిగలు, దూదేకుల వర్గాల్లో ప్రత్యేక డిమాండ్లు ఉన్నాయని వెల్లడించారు. జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

More Telugu News