Daam: 'డామ్' పొంచి ఉంది... కొత్త మాల్వేర్ పై అప్రమత్తం చేసిన కేంద్రం

  • ర్యాన్సమ్ వేర్ ఒకటి రంగప్రవేశం చేసిందన్న కేంద్రం
  • మొబైల్ ఫోన్ సెక్యూరిటీ వ్యవస్థలను బోల్తా కొట్టిస్తుందని వెల్లడి
  • కీలక డేటాను తన అధీనంలోకి తీసుకుంటుందని వివరణ
  • ఒరిజినల్ డేటాను డిలీట్ చేస్తుందన్న జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ 
Central govt says beware of Daam the dangerous malware

డామ్ అనే కొత్త మాల్వేర్ రంగప్రవేశం చేసిందని, మొబైల్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. 'డామ్' మాల్వేర్ ఎంతో జిత్తులమారి అని, ఇది మొబైల్ ఫోన్ భద్రతా వ్యవస్థలను కూడా ఏమార్చుతుందని, సెక్యూరిటీ ప్రోగ్రామ్ లను బోల్తా కొట్టించేలా రాన్సమ్ వేర్ ను అభివృద్ది చేసుకోగలదని కేంద్రం వివరించింది. 

ఫోన్ లోకి చొరబడిన తర్వాత కీలకమైన సమాచారాన్నంతా తన అధీనంలోకి తీసుకుంటుందని, కాల్ డేటా సహా కెమెరా అన్నీ కూడా 'డామ్' మాల్వేర్ గుప్పిట్లోకి వెళ్లిపోతాయని, బ్యాక్ గ్రౌండ్ ప్రాసెసింగ్ ను నిలిపివేస్తుందని నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వివరించింది. 

దొంగిలించిన డేటాను .enc ఎక్స్ టెన్షన్ తో ఎన్ క్రిప్ట్ చేసుకుంటుందని, ఆపై ఒరిజినల్ డేటాను డిలీట్  చేస్తుందని వివరించింది. దాంతో తన ఫోన్ లోని కీలక డేటాను కోల్పోయిన యూజర్... ఆ డేటా కోసం హ్యాకర్ కు చెల్లింపులు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని వెల్లడించింది. 

ఈ నేపథ్యంలో, అనుమానాస్పద లింకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ స్పష్టం చేసింది. కొత్త ఫోన్ నెంబర్ల నుంచి వచ్చే సందేశాల పట్ల స్పందించవద్దని, ఆ సందేశాల్లో ఏవైనా యూఆర్ఎల్స్ ఉంటే జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

More Telugu News