Nitish Kumar: అంతా బేకార్.. కొత్త పార్లమెంట్ తో ఏం అవసరం?: బీహార్ సీఎం నితీశ్ విమర్శలు

  • అధికారంలో ఉన్న వ్య‌క్తులు చ‌రిత్ర‌ను మార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారన్న నితీశ్ కుమార్
  • నీతి ఆయోగ్ భేటీ, పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లబోమని వెల్లడి
  • ఇప్పటికే పార్లమెంట్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని బహిష్కరించిన 20 ప్రతిపక్ష పార్టీలు
Nitish Kumar comments on new Parliament building event and Niti Aayog meet

ఢిల్లీలో కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని రేపు ప్రారంభించ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ప్రధాని ప్రారంభించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు.. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. రాష్ట్ర‌ప‌తి చేత ఎందుకు ప్రారంభింపజేయరని ప్రశ్నిస్తున్నాయి. 20కి పైగా పార్టీలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అస‌లు కొత్త పార్ల‌మెంట్ బిల్డింగ్ అవ‌స‌రం ఏముందని ఆయన ప్ర‌శ్నించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పాత పార్ల‌మెంట్ బిల్డింగ్ చా‌రిత్రాత్మ‌క‌మైనది. కానీ అధికారంలో ఉన్న వ్య‌క్తులు చ‌రిత్ర‌ను మార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. 

కొత్త పార్లమెంట్ భవనం ఓపెనింగ్, నీతి ఆయోగ్ మీటింగ్ కు వెళ్లకపోవడంపై స్పందిస్తూ.. ‘అక్కడి వెళ్లడం బేకార్’ అంటూ వ్యాఖ్యానించారు. ఈరోజు నీతి ఆయోగ్ సమావేశానికి, రేపు కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి హాజరుకావాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. 

‘‘అధికారంలో ఉన్న వ్యక్తులు ఈ దేశ చరిత్రను మార్చేందుకు ప్రయత్నిస్తారని నేను పదేపదే చెబుతున్నా. ప్రస్తుత పార్లమెంటు భారతదేశ చరిత్రలో భాగం. ఈ ప్రభుత్వం అకస్మాత్తుగా కొత్త పార్లమెంటును ఎందుకు నిర్మించాలనుకుంది? ఎందుకంటే అది ఈ చరిత్రను మార్చాలనుకుంటోంది” అని ఆరోపించారు.

More Telugu News