అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా

High Court adjourns hearing on Avinash Reddy anticipatory bail plea
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇవాళ అవినాశ్ రెడ్డి, వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం... రేపు సీబీఐ వాదనలు విననుంది. ఈ నేపథ్యంలో, అవినాశ్ ముందస్తు బెయిల్ పై ఉత్కంఠకు రేపటితో తెరపడే అవకాశాలున్నాయి. 

ఇవాళ సుదీర్ఘ సమయం పాటు హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. భోజన విరామం తర్వాత తీర్పు వస్తుందని భావించినా, సునీత తరఫు న్యాయవాది వాదనలు వినిపించడంతో... నేడు సీబీఐ వాదనలకు అవకాశం లేకపోయింది. సీబీఐ వాదనలు రేపు వింటామని హైకోర్టు పేర్కొంది. 

కాగా, సునీత తరఫున వాదించిన న్యాయవాది ఎల్.రవిచందర్... హత్య గురించి జగన్ కు కూడా తెలుసేమో అని సీబీఐ దర్యాప్తు చేస్తోందని వెల్లడించారు. జగన్ కు అవినాశ్ రెడ్డే చెప్పారా అనేదానిపై సీబీఐ దర్యాప్తు చేస్తోందని వివరించారు. 

ప్రస్తుతం అవినాశ్ రెడ్డి కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు. అవినాశ్ తల్లి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో ఆయన కూడా ఆసుపత్రి వద్దే ఉన్నారు.
Go Back to Shorts
YS Avinash Reddy
Anticipatory Bail
Viveka Murder
CBI
Telangana High Court

More Telugu News