Revanth Reddy: ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే ఓఆర్ఆర్ స్కాం చాలా పెద్దది: రేవంత్ రెడ్డి

  • ఓఆర్ఆర్ టెండర్లు నిబంధనలకు విరుద్ధమన్న రేవంత్ 
  • ఓఆర్ఆర్ టెండరును 30 ఏళ్లకు కట్టబెట్టారని విమర్శలు
  • హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం అది చెల్లదని వ్యాఖ్యలు
  • నిబంధన మార్చితే అది పెద్ద స్కామ్ అవుతుందని స్పష్టీకరణ
  • ఇలా నిబంధనలు మార్చే... ఢిల్లీ లిక్కర్ పాలసీ ఓ స్కాం అయిందని వివరణ
Revanth Reddy press meet on ORR tenders

కనీస ధర ప్రకటించకుండా టెండర్లు పిలవడం నిబంధనలకు విరుద్ధమని, హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) టీఓటీ టెండర్లు కూడా ఈ కోవలోకే వస్తాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. 

హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ అనుసరించి ఏ టెండరు పిలవాలన్నా 2031 లోపు వుండేలానే పిలవాలని, కానీ ఓఆర్ఆర్ టెండరును 30 సంవత్సరాలకు కట్టబెట్టారని ఆరోపించారు. దేశంలో ఎక్కడైనా 15, 20 ఏళ్లకు టెండర్లు పిలుస్తుంటారని, కానీ తెలంగాణ ప్రభుత్వం లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ ను 30 ఏళ్ల లీజుకు రాసిచ్చేసిందని, తద్వారా ఓఆర్ఆర్ ను అమ్మేస్తోందని విమర్శించారు. 

తాను వాస్తవాలు వెల్లడిస్తుంటే, వాటినే పత్రికలు రాస్తున్నాయని, కానీ రేవంత్ తప్పుడు సమాచారం ఇస్తుంటే పత్రికల్లో వేయడం సరికాదని ప్రభుత్వం ఖండిస్తోందని వివరించారు. ఈ టెండరు ఒప్పందాలపై ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వనంత మాత్రాన కాంగ్రెస్ వద్ద వివరాలు లేవు అనుకుని అర్వింద్ కుమార్, సుధీర్ కుమార్, వివేకానంద... కేటీఆర్ తరఫున బుకాయిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఓఆర్ఆర్ కు సంబంధించిన ఒప్పంద పత్రం మొత్తం తన వద్ద ఉందని వెల్లడించారు. 

2023 ఏప్రిల్ 27న ఒప్పందం చేసుకున్నారని, టెండర్లు ఆమోదించి ఇవాళ్టికి 30 రోజులు పూర్తయినందున, రూ.7,300 కోట్లలో 25 శాతం అంటే రూ.1800 కోట్లు ప్రభుత్వానికి ఐఆర్ బీ డెవలపర్స్ చెల్లించాల్సి ఉందని రేవంత్ రెడ్డి వివరించారు. కానీ, ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆరోపించారు. ఒప్పందాన్ని ఉల్లంఘించారన్నది స్పష్టంగా తెలుస్తోందని, పైగా ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. 

నిబంధనలను ఉల్లంఘించిన సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం టెండరు నిబంధనలు మార్చి ఉంటే ఆ విషయం చెప్పాలి అని నిలదీశారు. ఇది కూడా ఢిల్లీ లిక్కర్ స్కాం వంటిదేనా అనే సందేహాన్ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. 

ఢిల్లీ లిక్కర్ పాలసీ మొదట చాలా కఠిన నిబంధనలతో రూపొందించారని, కానీ కల్వకుంట్ల కవిత, ఇతర సౌత్ నాయకులు రంగప్రవేశం చేసిన ఆ తర్వాత ఆ లిక్కర్ పాలసీలో మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో సీఎం కేజ్రీవాల్ కు రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చారన్న ఆరోపణలపై ఇవాళ విచారణ ఎదుర్కొంటున్నారని వివరించారు. 

కానీ, ఓఆర్ఆర్ టెండర్ల విషయం లక్ష కోట్లకు సంబంధించినదని, అంత విలువైన ఆస్తిని కేవలం రూ.7,300 కోట్లకు అమ్ముకున్నారని తెలిపారు. దీనితో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కాం చాలా చిన్నదని రేవంత్ పేర్కొన్నారు.

ఇంత బాహాటంగా దోపిడీ జరుగుతుంటే బీజేపీ నేతలు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో ఇంత పెద్ద స్కాం జరుగుతుంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారు... ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు నిర్వహించడంలేదు అని నిలదీశారు. 

అవుటర్ రింగ్ రోడ్డును పూణేకు చెందిన ఐఆర్ బీ డెవలపర్స్ కు తెగనమ్మేశారని, ఇందులో కేసీఆర్, కేటీఆర్, అర్వింద్ కుమార్, సోమేశ్ కుమార్ ఉన్నారని తాము స్పష్టంగా చెబుతున్నామని వివరించారు. తామే కాకుండా, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి వివరించారు. 

కిషన్ రెడ్డి ఓసారి ప్రెస్ మీట్ పెట్టి రూ.2 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని అన్నారని, కానీ ఓ కుటుంబం ఇంత పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడితే, కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ ఎందుకు లేఖలు రాయడంలేదని విమర్శించారు.

More Telugu News