Ather 450X: జూన్ 1 లోపు కొంటే ఏథర్ 450ఎక్స్ పై రూ.32వేలు ఆదా

  • వచ్చే నెల నుంచి పెరిగిపోనున్న ఎలక్ట్రిక్ టూ వీలర్ల ధరలు
  • సబ్సిడీకి కోత పెడుతూ కేంద్రం నిర్ణయం
  • ఒక్కో వాహనంపై 40 శాతం సబ్సిడీ 15 శాతానికి తగ్గింపు
Electric two wheelers set to get costlier FAME II subsidy slashed

ఎలక్ట్రిక్ టూ వీలర్ (బైక్ లేదా స్కూటర్) కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? అదేదో ఈ నెలాఖరులోపు చేసేయండి. ఎందుకంటే ఒక్కో స్కూటర్ పై రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు రేట్లు పెరగనున్నాయి. దీనికి కారణం కేంద్ర సర్కారు తీసుకున్న నిర్ణయమే. 

ఫేమ్-2 పథకంలో భాగంగా ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాలకు ఇచ్చే సబ్సిడీని తగ్గిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ఎక్స్ షోరూమ్ ధరపై ప్రస్తుతం కేంద్ర సర్కారు 40 శాతంగా ఇస్తున్న సబ్సిడీని 15 శాతానికి తగ్గించింది. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరింత వివరంగా చెప్పుకోవాలంటే కిలోవాట్ పర్ హవర్ (కేడబ్ల్యూహెచ్) కు రూ.15,000గా ఉన్న సబ్సిడీని రూ.10,000కు కుదించింది. దీంతో ఎక్స్ షోరూమ్ ధరలు సుమారు 33 శాతం మేర పెరగనున్నాయి. 

దీంతో ఏథర్ ఎనర్జీ ధరల పెరుగుదలపై ప్రకటన విడుదల చేసింది. జూన్ 1 నుంచి ఏథర్ 450ఎక్స్ పై రూ.32,500 మేర ధర పెరగనుందని సూచించింది. మే 31లోపు స్కూటర్ ను కొనుగోలు చేయడం ద్వారా రూ.32,500 ఆదా చేసుకోవచ్చని పేర్కొంది. స్టాక్ నిల్వ ఉన్నంత వరకే ఈ ఆఫర్ ఉంటుందని ప్రకటించింది. ఏథర్ ఎనర్జీ సీఈవో తరుణ్ మెహతా సైతం తన ట్విట్టర్ ఖాతాలో దీన్ని రీట్వీట్ చేశారు. 2019లో సబ్సిడీ ఒక్కో వాహనంపై రూ. 30 వేలు ఉండేదని, 2021లో రూ.60 వేలకు పెంచారని, తిరిగి 2023లో రూ.22 వేలకు తగ్గిస్తున్నట్టు తరుణ్ మెహతా గణాంకాలను ప్రదర్శించారు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు చెబుతూ.. ప్రభుత్వ సబ్సిడీలపై కాకుండా పరిశ్రమ తన సొంత కాళ్లపై త్వరలో నిలదొక్కుకోవాలని ఆశించారు.

More Telugu News