Employees: నాలుగో దశ ఉద్యమానికి సిద్ధమవుతున్న ఏపీ ఉద్యోగులు

  • ఈ నెల 24న ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ మహాసభలు
  • పోస్టర్లు విడుదల చేసిన బొప్పరాజు వెంకటేశ్వర్లు
  • రాష్ట్రంలో మూడో దశ ఉద్యమం కొనసాగుతోందని వెల్లడి
  • డీఏ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం లిఖితపూర్వక స్పష్టత ఇవ్వాలని డిమాండ్
AP Govt employees ready for fourth stage agitation

ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఈ నెల 24న మహాసభలు నిర్వహిస్తోంది. ఈ 27వ మహాసభల పోస్టర్లను ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో నాలుగోదశ ఉద్యమానికి సిద్ధమవుతున్నామని వెల్లడించారు. ప్రస్తుతం మూడో దశ ఉద్యమం నడుస్తోందని తెలిపారు. 

ఈ నెల 27న ఏలూరులో ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నామని, ఈ సదస్సుకు ఉద్యోగులు తరలి రావాలని బొప్పరాజు పిలుపునిచ్చారు. తాము ఉద్యమం కొనసాగిస్తుండడం వల్లే ప్రభుత్వం స్పందిస్తోందని, తమ డిమాండ్లు న్యాయమైనవి కాబట్టే ప్రభుత్వం ముందుకు వస్తోందని స్పష్టం చేశారు. 

పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, మిగతా డిమాండ్లపైనా చర్చ జరగాలని, సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఉద్యమం కొనసాగిస్తామని బొప్పరాజు వివరించారు. డీఏ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారన్నది ప్రభుత్వం లిఖితపూర్వకంగా వెల్లడించాల్సిందేనని అన్నారు.

More Telugu News