Krunal Pandya: రిటైర్డ్ హర్ట్ గా వెళ్లిపోవడానికి కారణం చెప్పిన పాండ్యా

  • తొడ కండరాలు పట్టేసినట్టు వెల్లడి
  • తిమ్మిరిగా అనిపించడం వల్లే వెళ్లినట్టు ప్రకటన
  • చీటింగ్ అంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల విమర్శలు
  • మోసం కాదన్న రవిచంద్రన్ అశ్విన్
Krunal Pandya Explains Decision To Retire Hurt Against Mumbai Indians Amid Uproar

లక్నోలోని ఎక్నా స్టేడియంలో మంగళవారం చివరి బంతి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో ముంబైపై లక్నో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన లక్నో సేన 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఆ దశలో కెప్టెన్ కృనాల్ పాండ్య, స్టార్ బ్యాటర్ మార్కస్ స్టొయినిస్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును నిదానంగా పరుగెత్తించారు. 49 పరుగులు చేసిన దశలో కృనాల్ పాండ్య ఆకస్మికంగా రిటైర్డ్ హర్ట్ పేరుతో పెవిలియన్ చేరాడు. 

అయితే పాండ్యా ఎందుకు అలా చేశాడన్నది అభిమానులకు అర్థం కాలేదు. పాండ్యా స్థానంలో నికోలస్ పూరన్ రంగప్రవేశం చేశాడు. ఇక ఆ తర్వాత నుంచి స్టొయినిస్ ఉగ్రరూపం దాల్చాడు. లయ తప్పిన ప్రతి బంతిని డగౌట్స్ లోకి పంపించాడు. వీలైనన్ని సిక్సర్లు, బౌండరీలు రాబట్టి మెరుగైన స్కోరు సాధించేలా కృషి చేశాడు. అయితే పాండ్యా రిటైర్డ్ హర్ట్ అంశంపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే జరిగింది. పాండ్యా కావాలనే చేశాడని, ఇది చీటింగ్ అని కొందరు పేర్కొన్నారు. తాను రిటైర్డ్ హర్ట్ గా వెళ్లి, పూరన్ ను పంపిస్తే స్కోరు బోర్డు పరుగులు తీస్తుందనే అలా చేశాడంటూ కొందరు ఆరోపించారు. దీనిపై రాజస్థాన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ అతనిని రిటైర్డ్ ఔట్ గా పేర్కొన్నాడు. ఇక్కడ మోసం ఏమీ లేదని, నిబంధనలు అనుమతిస్తున్నాయని చెప్పాడు. 

మ్యాచ్ తర్వాత పాండ్యా మాట్లాడుతూ.. ‘‘కాలి కండరాలు పట్టేశాయి. తిమ్మిరిగా అనిపించింది’’ అంటూ రిటైర్డ్ హర్ట్ కు కారణాన్ని తెలియజేశాడు. తానెప్పుడూ జట్టు సభ్యుడినేనని, జట్టు కోసం ఏదైనా చేస్తానన్నాడు. ఫలితం పట్ల సంతోషంగా ఉన్నట్టు ప్రకటించాడు.

More Telugu News