SRH: అంపైర్ నోబాల్ ఇవ్వలేదని... లక్నో డగౌట్ పై ప్రతాపం చూపించిన హైదరాబాద్ ప్రేక్షకులు

  • ఇవాళ హైదరాబాదులో సన్ రైజర్స్ తో లక్నో మ్యాచ్
  • సన్ రైజర్స్ బ్యాటింగ్ సందర్భంగా ఘటన
  • లక్నో డగౌట్ పై వస్తువులు విసిరిన ప్రేక్షకులు
  • గంభీర్ ను రెచ్చగొట్టేలా కోహ్లీ కోహ్లీ అంటూ నినాదాలు
SRH and LSG match halts after audience anger

ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో ఓ అవాంఛనీయ సంఘటన చోటుచేసుకుంది. సన్ రైజర్స్ బ్యాటింగ్ చేస్తుండగా, అంపైర్ ఓ నోబాల్ ఇవ్వలేదని ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్నో డగౌట్ పై చేతికందిన వస్తువులు విసిరేశారు. దాంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. 

ఇన్నింగ్స్ 19వ ఓవర్ వద్ద ఆ ఘటన జరిగింది. సన్ రైజర్స్ బ్యాట్స్ మన్ అబ్దుల్ సమద్ బ్యాటింగ్ చేస్తుండగా... లక్నో పేసర్ అవేష్ ఖాన్ ఓ ఫుల్ టాస్ విసిరాడు. అయితే అంపైర్ దాన్ని నోబాల్ గా ప్రకటించలేదు. అది వికెట్ల కంటే ఎత్తులో వచ్చిందని భావించిన సన్ రైజర్స్ రివ్యూ కోరింది. డీఆర్ఎస్ లో సైతం నోబాల్ ఇవ్వలేదు. దాంతో సన్ రైజర్స్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అంపైర్ తో వాగ్వాదం జరిపాడు. 

అదే సమయంలో లక్నో డగౌట్ వద్ద కలకలం రేగింది. లక్నో కోచ్ ఆండీ ఫ్లవర్, ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ లేచి నిల్చుని ప్రేక్షకుల్లో ఓ దిశగా వేలు చూపించడం కనిపించింది. ఆ సమయంలో ప్రేక్షకుల్లో కొందరు గంభీర్ ను రెచ్చగొట్టేలా కోహ్లీ, కోహ్లీ అనే నినాదాలు చేశారు. దాంతో, మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. పరిస్థితి సద్దుమణగడంతో మ్యాచ్ మళ్లీ మొదలైంది. 

కాగా, ఈ ఘటన జరిగిన వెంటనే క్లాసెన్ అవుటయ్యాడు. క్లాసెన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రేక్షకుల వల్లే మ్యాచ్ ఆగిందని, దాంతో తన ఏకాగ్రత దెబ్బతిని అవుటయ్యానని అసంతృప్తి వ్యక్తం చేశాడు.

More Telugu News