Nara Lokesh: ​​ఆ జీవో చెల్లదని ఆ రోజే చెప్పాను: లోకేశ్

  • శ్రీశైలం నియోజకవర్గంలో ప్రవేశించిన యువగళం
  • ఉత్సాహంగా నారా లోకేశ్ పాదయాత్ర
  • ఎస్సీలు, రైతులు, వివిధ వర్గాలతో లోకేశ్ సమావేశాలు
  • వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని వ్యాఖ్య 
  • అన్ని వర్గాలను ఆదుకుంటామని భరోసా
Lokesh Yuvagalam Padayatra enters in Srisailam constituency

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 97వ రోజు నందికొట్కూరు నియోజకవర్గంలో కొనసాగింది. లోకేశ్ కు జనం నీరాజనాలు పలికారు. తాము ఎదుర్కొంటున్న కష్టాలు లోకేశ్ తో చెప్పుకున్నారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి కష్టాలు తీరుస్తుందని లోకేశ్ వారికి భరోసా ఇచ్చారు. 

బన్నూరు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర... కృష్ణారావుపేట, రుద్రవరం, పాములపాడు, కంభాలపల్లి, ఎర్రగూడూరు మీదుగా శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించింది. శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గ శివార్లలో యువనేతకు అపూర్వ స్వాగతం లభించింది. 

శ్రీశైలం ఇన్ చార్జి బుడ్డా రాజశేఖర్ రెడ్డి, సీనియర్ నేత ఏరాసు ప్రతాపరెడ్డి, పార్టీనాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున యువనేతకు ఎదురేగి స్వాగతం పలికారు.

జగన్మోసపురెడ్డి మాటలకు అర్థాలే వేరులే!

శ్రీశైలం నియోజకవర్గం కరివేములలో అగ్రిగోల్డ్ ఫామ్ ల్యాండ్ వద్ద సెల్ఫీ దిగిన లోకేశ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అబద్దాలు, మోసం, నయవంచన కలగలిసిన మానవ రూపాన్ని జగన్మోహన్ రెడ్డి అంటారని వ్యంగ్యం ప్రదర్శించారు. 

"శ్రీశైలం నియోజకవర్గం కరివేను గ్రామంలో అగ్రిగోల్డ్ కు చెందిన ఫామ్ ల్యాండ్ ఇది. ఆగ్రిగోల్డ్ ఆస్తులను మేం బినామీ పేర్లతో కొట్టేశామని అబద్ధపు ప్రచారంతో మాపై విషం చిమ్మిన జగన్... అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి నాలుగేళ్లు దాటిపోయింది. ఆరు నెలల్లో న్యాయం చేయడమంటే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేసిన మాదిరిగానేనా జగన్మోసపురెడ్డీ...? అంటూ ఎత్తిపొడిచారు. 

జీవో నెం.1 రద్దు జగన్ కు చెంపపెట్టు! 

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ముందు రాజారెడ్డి రాజ్యాంగం ఓడిందని లోకేశ్ వ్యాఖ్యానించారు. జీవో నెం.1 రద్దు జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని అన్నారు. జీవో నెం1. ఇచ్చిన రోజే ఇది చెల్లదు అని జగన్ కు చెప్పానని వెల్లడించారు. నేడు అదే జరిగిందని లోకేశ్ తెలిపారు. నందికొట్కూరు నియోజకవర్గం, పాములపాడులో ఎస్సీలతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. 

"జగన్మోహన్ రెడ్డి దళితులకు సంబంధించిన 27 పథకాలు రద్దు చేశాడు. అంబేద్కర్ పేరును విదేశీ విద్య పథకానికి చంద్రబాబు పెడితే, జగన్ దానిని తీసేసి తన పేరు పెట్టుకున్నాడు. మేం అధికారంలోకి వచ్చాక దళితులకు జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించి, ఖర్చు చేస్తాం" అని లోకేశ్ హామీ ఇచ్చారు.

బుగ్గనగారి దొంగ లెక్కలు!

ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన దొంగ లెక్కలు బాగా రాస్తాడని లోకేశ్ ఎద్దేవా చేశారు. నిధులు కేటాయిస్తాడే తప్ప, ఖర్చు చేయడని విమర్శించారు. టీడీపీ పరిపాలనలో దళితులకు ఖరీదైన వాహనాలు కొని స్వయం ఉపాధి కల్పించామని వెల్లడించారు. 

"దళిత సంక్షేమానికి రూ.40 వేల కోట్లు ఖర్చు చేశాం. 3 వేల ఎకరాలు కొనుగోలు చేసి దళితులకు ఇచ్చాం. దళిత విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడానికి బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చాం. విదేశీ విద్య పథకాన్ని అమలు చేసి విదేశాల్లో చదివించాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ పథకాలన్నింటినీ రద్దు చేశాడు. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టని పథకాలను కూడా చంద్రబాబు అమలు చేశారు" అని లోకేశ్ వివరించారు.

పత్తి రైతును కలిసిన లోకేశ్

నందికొట్కూరు నియోజకవర్గం కృష్ణారావుపేటలో పత్తిరైతును కలిసిన లోకేశ్ ఆయన సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు మంగలి సాయిబాబు... లోకేశ్ తో తన కష్టాలు ఏకరవు పెట్టాడు.

"నాకున్న మూడున్నర ఎకరాల్లో పత్తి పంట వేస్తున్నాను. నాలుగేళ్లుగా వరుస నష్టాలే వస్తున్నాయి. లక్ష రూపాయలు ఖర్చవుతుంటే కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదు. అకాల వర్షాల వల్ల పంట దెబ్బతింటే ఇటువైపు ముఖం చూపించిన వారు లేరు. ప్రభుత్వం నుంచి విత్తనాలు, పంటల బీమా, సబ్సిడీలు ఏవీ రావడం లేదు. నకిలీ విత్తనాల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలే శరణ్యం" అని వాపోయాడు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ... రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కల్తీ విత్తనాల మాఫియా పేట్రేగిపోతోందని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక అప్పుల పాలై 3 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వెల్లడించారు. 

"రైతుల సగటు అప్పులో ఆంధ్రప్రదేశ్ జాతీయస్థాయిలో మొదటిస్థానంలో ఉంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కల్తీ విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం. ఏపీ సీడ్ కార్పొరేషన్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సరఫరా చేస్తాం. పెట్టుబడులు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం" అని హామీ ఇచ్చారు.

*యువగళం వివరాలు*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1239.5 కి.మీ.*

*ఈరోజు నడిచింది దూరం 16.5 కి.మీ.*

*98వ రోజు (13.05.2023) పాదయాత్ర వివరాలు*

*శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం(నంద్యాల జిల్లా)*

సాయంత్రం

3.30 – కె.స్టార్ గోడౌన్ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

3.50 – కరివేనలో స్థానికులతో సమావేశం.

4.30 – ఆత్మకూరు బహిరంగసభలో లోకేశ్ ప్రసంగం.

6.30 – ఆత్మకూరు కోర్టురోడ్డులో లాయర్లతో సమావేశం.

6.40 – ఆత్మకూరు ఎండీఓ ఆఫీసు వద్ద స్వచ్చభారత్ అంబాసిడర్లతో సమావేశం.

6.50 – ఆత్మకూరు గౌడ్ బంక్ సెంటర్లతో వ్యాపారులతో సమావేశం.

7.05 – ఆత్మకూరు ఎస్ బిఐ వద్ద డ్వాక్రా మహిళలతో సమావేశం.

7.25 – నంద్యాల క్రాస్ వద్ద ముస్లింలతో సమావేశం.

8.30 – బ్రహ్మనాథపురంలో రైతులతో సమావేశం.

9.20 – నల్లకాల్వలో స్థానికులతో మాటామంతీ.

9.40 – చెంచుకాలనీలో స్థానికులతో మాటామంతీ.

9.55 – చెంచుకాలనీ శివారు విడిది కేంద్రంలో బస.

******

More Telugu News