సలహాలు తీసుకోనోడికి సలహాదారులు ఎందుకో?: వైఎస్ షర్మిల

ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. చెవిటోని ముందు శంఖం ఊదినట్లు... సలహాలు తీసుకోనోడికి సలహాదారులు ఎందుకో? అని ఎద్దేవా చేశారు. నియంత నిర్ణయాలతో తెలంగాణను కేసీఆర్ భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఒంటెద్దు పోకడతో తెలంగాణను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ప్రజల గోస వినే కమిషన్లకు ఆఫీసర్లు లేరుకానీ... దొరకు దోచిపెట్టే సలహాదారులను పక్కన చేర్చుకున్నారని దుయ్యబట్టారు.   
     
తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేవు కానీ... పక్క రాష్ట్రాల వ్యక్తులకు లక్షల జీతమిచ్చి మేపుతున్నారని షర్మిల విమర్శించారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి పని చేస్తున్నారని అన్నారు. వీళ్ళు రుణమాఫీ అమలు చేయమని సలహా ఇచ్చేవాళ్లా? లేక లక్షా 91 వేల ఉద్యోగాలు భర్తీ చేయమని సలహా ఇచ్చేవాళ్లా? అని ప్రశ్నించారు. 

పేదలకు ఇండ్లు కట్టి ఇవ్వమని సలహా ఇచ్చేవాళ్లా? రైతుబీమా అమలు చేయమని సలహా ఇచ్చేవాళ్లా? పోడు పట్టాలు, నిరుద్యోగ భృతి ఇవ్వమని సలహా ఇచ్చేవాళ్లా? ఇలాంటి సలహాలు ఇచ్చేవాళ్లయితే ఇప్పటి వరకు వీళ్ళు ఎందుకు ఇవ్వలేదని షర్మిల ప్రశ్నించారు.


More Telugu News