Jhansi: నన్ను చాలామంది మోసం చేశారు: యాంకర్ ఝాన్సీ

  • తనకి రావలసిన క్రెడిట్ రానీయకుండా చేశారన్న ఝాన్సీ 
  • తన వ్యక్తిత్వం నచ్చక తీసేసిన సందర్భాలు ఉన్నాయని వెల్లడి 
  • ఎవరిపైనా ఎప్పుడూ పగ సాధించే ఆలోచన చేయలేదని వివరణ  
Anchor Jhansi

ఒకప్పుడు సుమ తరువాత యాంకర్ గా ఝాన్సీ పేరు వినిపించేది. యాంకరింగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉండేది. ఆ తరువాత సినిమాలలోను ఆమె అడపా దడపా కనిపిస్తూనే వస్తున్నారు. తాజాగా 'ఐ డ్రీమ్స్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఝాన్సీ మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. 

"నాతో కలిసి పనిచేసినవారికి నేను ఏమిటనేది తెలుస్తుంది. అప్పటివరకూ అవతలవారు నా గురించి చాలా అనుకుంటారు. ఈవిడకి పొగరు ... మాట్లాడితే విప్లవం అంటుంది .. ఫైర్ బ్రాండ్ అని అనుకుంటారు. నాతో కలిసి పనిచేసిన తరువాత నేను ఏమిటనేది వారికి అర్థమవుతుంది. నన్ను అర్థం చేసుకున్నవారు కొన్నేళ్ల పాటు జర్నీ చేసేవారు. నేను నచ్చని వారు 13 ఎపిసోడ్స్ తో ఫుల్ స్టాప్ పెట్టేసేవారు" అన్నారు. 

"నన్ను చాలామంది మోసం చేశారు. అది గుర్తుపెట్టుకుని కక్ష సాధించే పని నేను ఎప్పుడూ చేయలేదు. అది నా మంచితనమో .. పిచ్చితనమో కూడా నాకు తెలియదు. నాకు రావలసిన క్రెడిట్ నాకు రాకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. 24 ఎపిసోడ్స్ చేసిన నన్ను, 25వ ఎపిసోడ్ కేక్ కటింగ్ కి ఉంచరు. 99 ఎపిసోడ్స్ చేసిన డాన్స్ షోకి 100 ఎపిసోడ్ కి నేను యాంకర్ ను కాదు. కారణం చెప్పరు .. నాకు తెలియదు .. నన్ను అడగరు" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News