Nitish Rana: కేకేఆర్ కెప్టెన్ భార్యను వెంబడించి, వేధించిన ఇద్దరు దుండగులు

  • కారులో వెళ్తుండగా.. ఢీకొట్టేందుకు యత్నించారన్న నితీశ్ రాణా భార్య సాచి మర్వా
  • పోలీసులకు ఫోన్ చేస్తే పట్టించుకోలేదని ఆవేదన
  • ‘క్షేమంగా వెళ్లారుగా వదిలేయండి.. మరోసారి జరిగితే నంబర్ నోట్ చేసుకోమన్నార’ని ఆరోపణ
  • తర్వాత నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు
Cricketers Wife Stalked and Harassed In Delhi

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ నితీశ్ రాణా భార్యను ఇద్దరు దుండగులు వేధించారు. శుక్రవారం ఢిల్లీలో వెళ్తున్న ఆమెను వెంబడించి దాడికి యత్నించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు.. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. 

రాణా భార్య సాచి మర్వా.. శుక్రవారం రాత్రి పని ముగించుకుని ఢిల్లీలోని కీర్తి నగర్ కు కారులో బయల్దేరారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు బైకుపై వెంబడించారు. కారు దగ్గరగా నడుపుతూ.. ఢీకొట్టేందుకు యత్నించారు. 

దుండగులను గమనించిన సాచి.. తన ఫోన్ లో ఫొటోలు తీశారు. ఈ ఘటన గురించి తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. నిందితుల ఫొటోలను షేర్ చేశారు. ఇదే సమయంలో పోలీసుల తీరుపైనా అసహనం వ్యక్తం చేశారు. 

తన ఫిర్యాదును స్వీకరించేందుకు పోలీసులు అంగీకరించలేదని చెప్పారు. ‘‘క్షేమంగా ఇంటికి వెళ్లారు కదా ఇక్కడితో వదిలేయండి. తర్వాత కూడా ఇలానే జరిగితే నంబర్ నోట్ చేసుకోండి’’ అని మాట్లాడారని వాపోయారు. ‘‘సరే సర్.. మళ్లీ ఇలానే జరిగితే.. వాళ్ల ఫోన్ నంబర్లు కూడా తీసుకుంటా’’ అని ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఎద్దేవా చేశారు.

More Telugu News