Ponguleti Srinivas Reddy: కొత్త పార్టీ ఏర్పాటు దిశగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి?.. పేరు టీఆర్ఎస్?

  • తెలంగాణ రైతు సమాఖ్య పేరుతో కొత్త పార్టీని రిజిస్టర్ చేయించినట్టు సమాచారం
  • 45 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్న పొంగులేటి
  • కనీసం 15 స్థానాల్లో గెలవడమే టార్గెట్
Ponguleti Srinivas Reddy to launch new party

బీఆర్ఎస్ పై తిరుగుబాటు చేసిన మాజీ ఎంపీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కొత్త పార్టీని స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రైతు సమాఖ్య (టీఆర్ఎస్) పేరుతో ఇటీవల ఒక కొత్త పార్టీ ఎన్నికల కమిషన్ లో రిజిస్టర్ అయింది. ఈ పార్టీని పొంగులేటి సన్నిహితులే రిజిస్టర్ చేయించినట్టు సమాచారం. 

అంతేకాదు వచ్చే ఎన్నికల్లో 45 స్థానాల్లో తన అనుచరులను పోటీ చేయించాలని పొంగులేటి భావిస్తున్నారు. బీఆర్ఎస్ లో ఎప్పటి నుంచో ఉండి ఆ పార్టీ టికెట్ దక్కక, అసహనంతో ఉన్న నేతలపై ఆయన దృష్టి సారించారు. ప్రజల్లో మంచి పేరు ఉండటమే కాకుండా, తనపట్ల నమ్మకంగా ఉండే వారి కోసం అన్వేషిస్తున్నారు. తమ పార్టీ తరపున గెలిచి, ఎన్నికల తర్వాత ఇతర పార్టీల్లోకి జంప్ కాకుండా ఉండే నేతల కోసం వెతుకుతున్నారు. కనీసం 15 మంది ఎమ్మెల్యేలు గెలవాలనే టార్గెట్ తో వ్యూహరచన చేస్తున్నారు.

ఇప్పటికే ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో అభ్యర్థులను గుర్తించే కార్యక్రమం ప్రారంభమయిందని సమాచారం. మరోవైపు ఎన్నికలకు సమయం ఎక్కువగా లేకపోవడంతో ఈలోగా వీరి పార్టీకి కామన్ సింబల్ వచ్చే అవకాశం లేదు. దీంతో, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తు తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులందరికీ లభించేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంలో పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

More Telugu News