Jai Shankar: ఉగ్రవాద బాధితులు, ఉగ్రవాద నేరస్థులు పక్కపక్కనే ఎలా కూర్చోవాలి?: జై శంకర్

  • ఎస్ సీవో సదస్సుకు ఆతిథ్యమిస్తున్న భారత్
  • గోవాలో సదస్సుకు విచ్చేసిన పాక్ విదేశాంగ మంత్రి
  • రాజౌరీలో ఉగ్రవాద చర్యలో ఐదుగురు ఆర్మీ జవాన్ల మృతి
  • పాక్ విశ్వసనీయత దిగజారిపోతోందన్న జై శంకర్
Jai Shankar scathing attack on Pakistan after Rajouri incident which took five army jawans lives

ఈసారి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సీవో) సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు గోవాలో జరుగుతున్నాయి. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా ఎస్ సీవో సదస్సు కోసం భారత్ రావడం కీలక పరిణామం. దీనిపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ స్పందించారు. 

ఉగ్రవాదానికి కేంద్ర స్థానంగా ఉన్న పాకిస్థాన్ కు ఇలాంటి సదస్సులో స్థానం కల్పించడాన్ని ప్రశ్నించారు. ఉగ్రవాద బాధితులు (భారత్), ఉగ్రవాద నేరస్థులు (పాకిస్థాన్) పక్కపక్కనే కూర్చోలేరని నిశిత విమర్శలు చేశారు. ఇక్కడికి వచ్చి "మేం కూడా ఉగ్రవాద బాధితులమే" అని మొసలికన్నీరు కార్చితే నమ్మేవాళ్లెవరూ లేరని అన్నారు. పాక్ విశ్వసనీయత ఆ దేశ విదేశీ మారకద్రవ్య నిల్వల కంటే వేగంగా దిగజారిపోతోందని జై శంకర్ వ్యాఖ్యానించారు. 

రాజౌరీ జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ లో పాల్గొన్న ఐదుగురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో జై శంకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాక్ ను వేలెత్తి చూపారు. 

శ్రీనగర్ లో ఈ నెల చివరిలో  జీ20 సదస్సు ఉంటుందని ప్రకటించాక, ఇది జమ్మూకశ్మీర్ లో జరిగిన రెండో భారీ ఉగ్రవాద దాడి అని పేర్కొన్నారు. ఇప్పుడు జీ20 విషయంలో పాకిస్థాన్ చేయగలిగిందేమీ లేదని, పాకిస్థాన్ ఏదైనా చేయాల్సి ఉంటే అది ఆక్రమిత కశ్మీర్ నుంచి వైదొలగడమేనని జై శంకర్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆ పని ఎప్పుడు చేస్తుందన్నదే అసలు విషయం అని తెలిపారు.

More Telugu News