Allari Naresh: 'ఉగ్రం' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్!

  • ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న 'ఉగ్రం'
  • యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే సినిమా  
  • ఈ సినిమాకి అన్నీ కుదిరాయన్న దర్శకుడు
  • 100 సినిమాలు పూర్తిచేసే హీరో నరేశేనని వ్యాఖ్య  
  • ఈ నెల 5వ తేదీన సినిమా విడుదల  
Ugram Pre Release Event

అల్లరి నరేశ్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో 'ఉగ్రం' సినిమా రూపొందింది. సాహు గారపాటి - హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమాకి, శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 5వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాద్ .. జేఆర్సీ  కన్వెన్షన్ లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హరీశ్ శంకర్ .. అనిల్ రావిపూడి .. బుచ్చిబాబు .. విష్వక్సేన్ .. అడివి శేష్ .. సందీప్ కిషన్ తదితరులు హాజరయ్యారు. 

'ఉగ్రం'ను బ్లాక్ బస్టర్ హిట్ చేయాలి .. 

ఈ వేదికపై శివ నిర్వాణ మాట్లాడుతూ .. " అల్లరి నరేశ్ ఎప్పటికప్పుడు తన జోనర్స్ ను మార్చుకుంటూ వెళుతున్నారు. నేను .. గమ్యం .. నాంది సినిమాలు అలా వచ్చినవే. అదే తరహాలో ఇప్పుడు 'ఉగ్రం' వస్తోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ చేస్తే, ఆయన కొత్త కథలను .. కొత్త దర్శకులను పరిచయం చేస్తారు" అని అన్నారు. 

థియేటర్స్ దద్దరిల్లిపోతాయి .. 

దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడుతూ ... "ఈ సినిమా షూటింగును 73 రోజుల్లో పూర్తి చేశాను. 50 రోజుల పాటు రాత్రివేళల్లోనే షూటింగు చేశాము. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. 4 రోజుల్లోనే భారీ సెట్ వేయడం ఆయనకే సాధ్యమైంది. నరేశ్ నటన .. శ్రీచరణ్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి . థియేటర్స్ దద్దరిల్లిపోతాయి " అని చెప్పుకొచ్చారు.

నరేశ్ గొప్పనటుడని నాకు తెలుసు .. 

అనిల్ రావిపూడి  మాట్లాడుతూ .. "నరేశ్ చాలా కాలం నుంచి నాకు తెలుసు. ఆయన ఎంత గొప్ప నటుడు అనేది కూడా నాకు తెలుసు. ఈ సినిమా నిర్మాతలకు సహనం ఎక్కువ. క్వాలిటీ కోసం ఎంత ఖర్చు అయినా చేస్తారు. ఈ సినిమాతో పరిచయమవుతున్న 'మిర్నా'కి మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.  

ఈ జనరేషన్ లో 100 సినిమాలు పూర్తి చేసేది ఆయనే ..  

హరీశ్ శంకర్ మాట్లాడుతూ .. "నా శిష్యులు ఎవరూ దర్శకులు కావడం లేదంటూ ఈ మధ్య సుకుమార్ నన్ను ర్యాగింగ్ చేస్తున్నాడు. విజయ్ కనకమేడల ఆ లోటును భర్తీ చేశాడు. ఈ జనరేషన్ లో 100 సినిమాలను పూర్తిచేసే హీరోగా అల్లరి నరేశ్ మాత్రమే కనిపిస్తున్నాడు. అప్పుడప్పుడు ఆయన అల్లరి కూడా చేయాలని కోరుకుంటున్నాను" అన్నారు. 

ఇకపై యాంగ్రీ నరేశ్ అని పిలుస్తారేమో ..

అడివి శేష్ మాట్లాడుతూ .. "నరేశ్ గారితో నాకు పెద్ద పరిచయం లేదుగానీ, ఆయన యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కామెడీ బాగా చేస్తాడని అంటారుగానీ. ఎమోషన్స్ ను అంతకంటే బాగా చేస్తారు. ఈ సినిమా తరువాత అందరూ కూడా ఆయనను యాంగ్రీ నరేశ్ అని పిలుస్తారేమో అనిపిస్తోంది" అంటూ చెప్పుకొచ్చారు. 

ఈ సారి నా ఉగ్రరూపం చూడబోతున్నారు .. 

అల్లరి నరేశ్ మాట్లాడుతూ .. విజయ్ కనకమేడలకి .. నాకు మధ్య మంచి ట్యూన్ కుదిరింది., ఆయనతో మరో సినిమాను చేయాలనుకుంటున్నాను.  ఈ లోగా మిగతా కమిట్ మెంట్స్ పూర్తి చేస్తాము. ఈ సినిమాకి ఫైట్స్ హైలైట్ అవుతాయి. రామకృష్ణ గొప్పగా కంపోజ్ చేశాడు. ఇంతకుముందు నేను నవ్వించాను .. ఏడిపించాను. ఈ సారి నా ఉగ్రరూపం ఎలా ఉంటుందనేది చూస్తారు" అంటూ చెప్పుకొచ్చారు.   

More Telugu News