Siddaramaiah: బీజేపీ మేనిఫెస్టో మొత్తం బోగస్... రేపు మా మేనిఫెస్టో వస్తోంది చూస్కోండి!: సిద్ధరామయ్య

  • కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు
  • ప్రధాన పార్టీల మధ్య విమర్శల పర్వం
  • నేడు మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ
  • గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే దిక్కులేదన్న సిద్ధరామయ్య
Siddaramaiah slams BJP manifesto

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య విమర్శల దాడి కూడా తీవ్రస్థాయికి చేరింది. ఇవాళ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయగా, మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య విమర్శనాస్త్రాలు సంధించారు. 

బీజేపీ మేనిఫెస్టో మొత్తం బోగస్ అని కొట్టిపారేశారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలనే బీజేపీ ఇప్పటిదాకా అమలు చేయలేదని అన్నారు. తాము కూడా రేపు మేనిఫెస్టో విడుదల చేస్తున్నామని సిద్ధరామయ్య చెప్పారు. కానీ, తాము అమలు చేయదగిన మేనిఫెస్టోనే ప్రకటిస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ కు బీజేపీకి మధ్య ఉన్న తేడా అదేనని స్పష్టం చేశారు. 

2018 ఎన్నికల వేళ బీజేపీ 600 హామీలు ఇచ్చిందని, కేవలం 55 హామీలనే నెరవేర్చిందని తెలిపారు. తాము 165 హామీలు ఇచ్చి 158 నెరవేర్చామని సిద్ధరామయ్య వివరించారు. కాగా, కర్ణాటకలో ఈ నెల 10న పోలింగ్ జరగనుండగా, 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

More Telugu News