Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వైసీపీ నేతల విమర్శల హోరు.. క్షమాపణలు చెప్పాలంటూ అభిమానుల డిమాండ్

  • శతజయంతి వేడుకలో ఎన్టీఆర్, చంద్రబాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న రజనీకాంత్
  • తలైవాపై విరుచుకుపడిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు 
  • పందులే గుంపులుగా వస్తాయంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్న రజనీ అభిమానులు
Tamil Super Star Rajinikanth Fans Sought Apologies From YCP Leaders

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు అతిథిగా విజయవాడ వచ్చి ఎన్టీఆర్, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు చేయడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రజనీకాంత్‌కు వారందరూ వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేస్తున్నారు. #YSRCPApologizeRajini హ్యాష్‌ట్యాగ్‌తో వైసీపీ నేతలపై కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. మీమ్స్ పోస్టు చేస్తూ ట్విట్టర్‌ను హోరెత్తించారు. దీంతో కొన్ని క్షణాల్లోనే ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

ఎన్టీఆర్ శతజయంతి సభలో రజనీకాంత్ ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదని, ఎన్టీఆర్, చంద్రబాబుతో తనుకున్న అనుబంధాన్ని మాత్రమే పంచుకున్నారని గుర్తు చేస్తున్నారు. వారి స్నేహం ఈనాటిది కాదంటూ అప్పటి ఫొటోలను పోస్టు చేస్తున్నారు. శివాజీ సినిమాలో రజనీకాంత్ చెప్పే.. ‘నాన్నా పందులే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్‌గా వస్తుంది’ అని డైలాగ్‌తో మీమ్స్ క్రియేట్ చేసి వదులుతున్నారు.

శతజయంతి ఉత్సవాల్లో రజనీకాంత్ పాల్గొని అటు వెళ్లగానే ఆయనపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. మంత్రులు రోజా, అంబటి రాంబాబు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తదితరులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన తమిళనాడులో హీరో అయితే, ఇక్కడేం గొప్ప అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రం వారితో నీతులు చెప్పించుకునే స్థితిలో లేమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News